Last Updated:
Encounter: పశ్చిమ బెంగాల్లోని బారుయిపూర్లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మోండల్ బుధవారం తెల్లవారుజామున జరిగిన పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ (ఘటనా స్థలాన్ని పునర్నిర్మించడం) కోసం పోలీసులు అతడిని తీసుకువెళుతుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బారుయిపూర్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన బృందంతో కలిసి నిందితుడు ప్రభాస్ మోండల్ను తీసుకుని బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 12:45 గంటల సమయంలో స్టేషన్ నుండి బయలుదేరారు. బాలిక మృతదేహం లభ్యమైన సూర్యపూర్ ప్రాంతంలో సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయడానికి వెళ్లారు. అయితే, ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే నిందితుడు మోండల్ అకస్మాత్తుగా ఒక పోలీస్ అధికారి నుండి తుపాకీని లాక్కుని, పోలీసులపై ఒక రౌండ్ కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని బారుయిపూర్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై బారుయిపూర్ ఎస్పీ స్పందిస్తూ.. “నిందితుడు తుపాకీ లాక్కుని కాల్పులు జరపడంతో, పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఆసుపత్రిలో అతను మరణించినట్లు నిర్ధారించారు” అని తెలిపారు.
జులై 4 నుండి కనిపించకుండా పోయిన 11-12 ఏళ్ల బాలిక మృతదేహం ఒక రోజు తర్వాత సూర్యపూర్ హాట్ ప్రాంతంలో గోనె సంచిలో కుక్కబడి లభ్యమైంది. ఈ ఘోరకలి స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ స్థానికులు బారుయిపూర్-జోయ్నగర్ రహదారిని దిగ్బంధించి, టైర్లను తగులబెట్టారు. ఆగ్రహించిన నిరసనకారులు పోలీస్ వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే బాలిక మరణంతో సంబంధం ఉందనే అనుమానంతో ఒక వ్యక్తిని కోపోద్రిక్తులైన గుంపు కొట్టి చంపింది (లిన్చింగ్).
బాలిక ప్రాథమిక పోస్ట్మార్టం నివేదిక అత్యంత ఘోరమైన నిజాలను బయటపెట్టింది. బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఆమె ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాల గుర్తులు, శరీరంపై గోళ్ళ గీతలు, కాటు గుర్తులు ఉన్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అంతేకాకుండా, బాలిక తలపై ఏదో బరువైన వస్తువుతో బలంగా బాదడం లేదా గట్టి ఉపరితలానికి కొట్టడం జరిగిందని తేలింది. బాలిక ఊపిరితిత్తులు, కడుపులో నీరు చేరి ఉండటాన్ని బట్టి.. తలకు తీవ్ర గాయమై రక్తం కారుతున్న స్థితిలోనే ఆమెను నీటిలో పడేసారని, ఆ రకంగా రక్తస్రావం, నీటిలో మునగడం వల్లే ఆమె ప్రాణాలు పోయాయని వైద్యులు నిర్ధారించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంగళవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కేసుపై 72 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తాము డీజీపీ సిద్ధ నాథ్ గుప్తాను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే, నిరసనల సమయంలో గుంపు దాడిలో మరణించిన యువకుడు ఇంద్రజిత్ మోండల్ పూర్తిగా అమాయకుడని సీఎం స్పష్టం చేశారు.
“మేము ప్రాథమిక విశ్లేషణ చేశాము. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు స్పందించడంలో ఒక శాతం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయి. అలాగే ప్రజా రవాణాను, రైల్వే ట్రాక్లను ధ్వంసం చేసిన దాదాపు 200 మందిని గుర్తించాము. గుంపు దాడిలో చనిపోయిన ఇంద్రజిత్ మోండల్ కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుంది” అని సీఎం అన్నారు.
ప్రస్తుతం ఈ అత్యాచారం మరియు హత్యకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కేసును మరింత లోతుగా విచారించడానికి ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 08, 2026 11:03 AM IST













