స్వరసామ్రాజ్ఞి ఎస్.జానకి అంత్యక్రియలు ముగిశాయి. శనివారం రాత్రి ఆమె అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కర్ణాటక ప్రభుత్వం మైసూరులో అధికారిక లాంఛనాలతో ఆమె అంత్యక్రియలను నిర్వహించింది.జానకి మనవరాలు అప్సర విద్యుల ఆమెకు అంతిమ సంస్కారాలు చేశారు. అంతకుముందు అభిమానుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. వేలాది పాటలతో అలరించిన జానకమ్మను కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
2. పవన్ కళ్యాణ్కు సర్జరీ.. హాస్పిటల్కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. శనివారం ఆయన కుడి భుజానికి ఈ సర్జరీ జరిగింది. పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబై వెళ్లారు. ఆయన ఆస్పత్రికి చేరుకుని పవన్ కల్యాణ్తో సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
3. కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతలను ఉద్దేశిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. 60 ఏళ్లు తెలంగాణ నెత్తురు తాగినా కాంగ్రెస్ రక్తదాహం తీరలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు బలితీసుకున్న చరిత్ర ఆ పార్టీదేనని మండిపడ్డారు. కాంగ్రెస్ రక్కసి కోరలకు తెలంగాణ బిడ్డల నెత్తుటి మరకలు అంటాయని విమర్శించారు.
4. హింసను ప్రేరేపించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా ఆయన ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నిన్నటి వివాదాస్పద వ్యాఖ్యలపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన, నిపుణులు చెబుతున్నా మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
5. విశాఖలోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
విశాఖలో పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది.గాజువాక, మంగళపాలెం, పెదవాల్తేరు, ఆరిలోవ, ఎంవీపీ, అప్పుఘర్ ప్రాంతాల్లో ఉదయం 5.08 గంటలకు ప్రకంపనలు వచ్చాయి. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
6. జులై 16 నుంచి వర్షాలు!
రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఎండలు తీవ్రంగా ఉంటూ వేసవిని తలపిస్తున్నాయి.ఈ సమయంలో వాతావరణ నిపుణులు ఒక గుడ్న్యూస్ చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.ముందుగా ఈ నెల 16 నుంచి 19 మధ్య అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. ఇవి వేడి వాతావరణం వల్ల వచ్చే తాత్కాలిక వానలే అని తెలిపారు. ఆ తర్వాత, అంటే 19వ తేదీ నుంచి వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.
7. హర్ముజ్ను మళ్లీ మూసివేసిన ఇరాన్!
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. అక్కడ సైప్రస్ జెండాతో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ దాడిలో నౌకలోని ఒక సిబ్బంది మరణించినట్లు అమెరికా రక్షణ విభాగం ధ్రువీకరించింది.ఈ ఘటన తర్వాత హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనిపై అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తన తప్పుడు నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు. దాంతో, టెహ్రాన్పై అమెరికా సైనిక దాడులు చేయవచ్చని పశ్చిమాసియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
8. రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్లో మారణహోమం
ఉక్రెయిన్ ఈశాన్య నగరమైన సుమీపై రష్యా సైన్యం వినాశకరమైన దాడులకు తెగబడింది. ఈ దాడుల కోసం రష్యా గైడెడ్ ఏరియల్ బాంబులను ఉపయోగించింది.రష్యా జరిపిన ఈ వైమానిక దాడుల వల్ల అక్కడి నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే పౌర మౌలిక సదుపాయాలు కూడా భారీగా ధ్వంసమయ్యాయి.
9. సమంత ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డు..
అగ్ర కథానాయిక సమంత సరికొత్త రికార్డు సృష్టించారు. ఆమె ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’తొలిరోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది.కథానాయిక ప్రాధాన్యమున్న ఒక తెలుగు చిత్రం ఈ మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి. ఈ సంతోషకరమైన సందర్భంలో చిత్ర బృందం సమంతకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది.
10. ‘రాకా’.. నాలుగు వేర్వేరు పాత్రల్లో అల్లు అర్జున్?
అగ్ర నటుడు అల్లు అర్జున్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అట్లీ ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాకా’ అనే పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు వేర్వేరు పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇందులో తాత, తండ్రి, అలాగే ఇద్దరు కొడుకులుగా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే, బన్నీ కెరీర్లోనే ఇది మొదటి మల్టిపుల్ రోల్ సినిమా అవుతుంది.













