Last Updated:
China: చైనాను వారం రోజుల వ్యవధిలోనే వరుసగా రెండో తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ‘బావి’ తుఫాన్ తూర్పు చైనాలో రెండు వేర్వేరు చోట్ల తీరాన్ని దాటడంతో అక్కడి ప్రభుత్వం దాదాపు 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్లు) వెడల్పుతో – దాదాపు ఫ్రాన్స్ దేశమంత వైశాల్యంతో వ్యాపించిన ఈ భారీ తుఫాన్ శనివారం సాయంత్రం మొదట తైజౌ (Taizhou) తీర ప్రాంత నగరంలో కాసేపు అలజడి సృష్టించి, ఆపై అర్ధరాత్రి వేళ వెన్జౌ (Wenzhou) నగర సమీపంలో రెండోసారి తీరాన్ని దాటింది. ప్రస్తుతం ఈ తుఫాన్ తీవ్రమైన ఉష్ణమండల తుపానుగా బలహీనపడినప్పటికీ ఇంకా ముప్పు పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు.
చైనా ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం.. ఆదివారం ఉదయానికి ఈ తుపాన్ కేంద్రం జెజియాంగ్ ప్రాంతంలోని హాంగ్జౌ (Hangzhou) నగరానికి చేరుకుంది. ఇది సోమవారం నాటికి తూర్పు అన్హుయ్ (Anhui) లోకి ప్రవేశించి, మంగళవారం నాటికి షాన్డాంగ్ ద్వీపకల్పం మీదుగా ఉత్తర ఎల్లో సీ (Yellow Sea) వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న జెజియాంగ్ ప్రావిన్స్లోనే దాదాపు 17 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, పొరుగున ఉన్న ఇతర ప్రావిన్స్ల నుండి కూడా వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. జెజియాంగ్ అంతటా పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు 400 విమాన సర్వీసులు, డజన్ల కొద్దీ రైళ్లను రద్దు చేశారు.
సుమారు కోటి జనాభా ఉండి, తుపాను మార్గానికి అత్యంత సమీపంలో ఉన్న వెన్జౌ నగరం నుండి లక్షలాది మందిని ఖాళీ చేయించారు. “ఇళ్లపై ఉన్న పెంకులు, చెట్ల కొమ్మలు విరిగిపడటం మాకు స్పష్టంగా వినిపించింది. మేము చాలా భయపడ్డాం” అని వెన్జౌ నివాసి లి లియాంగ్సింగ్ రాయిటర్స్ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా రాజధాని బీజింగ్లోనూ లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
చైనాకు చేరుకోవడానికి ముందు ‘బావి’ తుపాను పసిఫిక్ మహాసముద్రంలో సూపర్ తుఫాన్గా రూపాంతరం చెందింది. గత సోమవారం గ్వామ్ మరియు నార్తర్న్ మరియానా దీవులను గంటకు 290 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో ఈ తుఫాన్ దెబ్బతీసింది.
ఆ తర్వాత జపాన్కు చెందిన సకిషిమా దీవుల మీదుగా వెళ్లేసరికి గాలుల వేగం గంటకు 144 కిలోమీటర్లకు తగ్గింది. అయినప్పటికీ, జపాన్లో కనీసం ఐదుగురు గాయపడగా, వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తైవాన్లో నేరుగా తీరం దాటకపోయినప్పటికీ, భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందన్న భయంతో వేలాది మందిని తరలించారు. తైవాన్ అధికారులు ఈ తుపాను వల్ల ఒక మీటరు వరకు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించడంతో ప్రజలు సూపర్ మార్కెట్లపై పడి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు.
ఈ తుపాన్ సృష్టించిన బీభత్సం వల్ల అంతకుముందు ఫిలిప్పీన్స్లో కొండచరియలు విరిగిపడి కనీసం 17 మంది మరణించారు. ఇదిలావుండగా, దక్షిణ చైనా ఈ వారంలోనే అంతకుముందు వచ్చిన ‘మేసాక్’ (Typhoon Maysak) తుఫాన్ సృష్టించిన నష్టం నుండి ఇంకా కోలుకోకముందే ఈ సరికొత్త విపత్తు వచ్చిపడింది. మేసాక్ తుఫాన్ కారణంగా చైనాలో 39 మంది మరణించగా, పశుసంపద భారీగా నష్టపోయింది. అలాగే సెంట్రల్ హుబే ప్రావిన్స్లో రెండు అరుదైన సుడిగాలులు (Tornadoes) కూడా సంభవించాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














