Last Updated:
భర్త మరణంతో కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళ రెండో పెళ్లి చేసుకుంటే ఉద్యోగం పోతుందా? కేంద్ర ప్రభుత్వ DoPT నిబంధనలు ఏమంటున్నాయి? ఎవరు అర్హులు? నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సంచలన ఘటన దేశవ్యాప్తంగా కారుణ్య నియామకాల (Compassionate Appointment)పై చర్చకు దారితీసింది. జైపూర్కు చెందిన 23 ఏళ్ల ఆయుషి శర్మ అనే యువతి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబ ఆస్తి కోసం తన తల్లి నీరజ్ శర్మ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. జూలై 3న 45 ఏళ్ల నీరజ్ శర్మ వేగంగా వచ్చిన స్కార్పియో వాహనం ఢీకొనడంతో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కారుణ్య నియామకాల నిబంధనలపై ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అందులో ముఖ్యంగా, భర్త మరణించిన తర్వాత కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొందిన మహిళ రెండో పెళ్లి చేసుకుంటే ఆ ఉద్యోగం రద్దవుతుందా? అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) మార్గదర్శకాల ప్రకారం, కారుణ్య నియామకం పొందిన వితంతువు తర్వాత తిరిగి వివాహం చేసుకున్నా కేవలం ఆ కారణంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగం రద్దు కాదు. ఒకసారి నిబంధనల ప్రకారం ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగానే కొనసాగుతుంది. రెండో వివాహం కారణంగా ఉద్యోగాన్ని తొలగించే నిబంధన కేంద్ర మార్గదర్శకాల్లో లేదు.
కారుణ్య నియామకం అనేది ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగానే మరణించినప్పుడు లేదా తీవ్రమైన అనారోగ్యం కారణంగా ముందుగానే పదవీ విరమణ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ కుటుంబం ఆకస్మిక ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా తక్షణ ఉపశమనం కల్పించేందుకు తీసుకొచ్చిన సంక్షేమ చర్య. ఇది కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాల్సిన హక్కు కాదు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు, అర్హతలు, ఖాళీల లభ్యత, సంబంధిత శాఖ అనుమతి వంటి అంశాల ఆధారంగా మాత్రమే నియామకం జరుగుతుంది.
DoPT నిబంధనల ప్రకారం మరణించిన ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడిన కుటుంబ సభ్యులు మాత్రమే కారుణ్య నియామకానికి అర్హులు. జీవిత భాగస్వామి, కుమారుడు, కుమార్తె, వివాహిత, అవివాహిత, వితంతువు, విడాకులు పొందిన లేదా దత్తత తీసుకున్న కుమార్తె కూడా అర్హుల జాబితాలో ఉంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, మరణించిన ఉద్యోగి అవివాహితుడై ఉంటే, అతనిపై ఆధారపడిన సోదరుడు లేదా సోదరి కూడా అర్హులుగా పరిగణించవచ్చు. ఉద్యోగి వివాహితుడైతే సాధారణంగా జీవిత భాగస్వామికే తొలి ప్రాధాన్యం ఇస్తారు.
కారుణ్య నియామకం పొందాలంటే సంబంధిత ప్రభుత్వ శాఖకు కుటుంబ సభ్యులు అధికారికంగా దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తుతో పాటు ఉద్యోగి మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలు, ఆస్తులు-అప్పుల సమాచారం, అవసరమైతే ఇతర అర్హులైన కుటుంబ సభ్యుల నుంచి నిరభ్యంతర పత్రం (NOC), లీగల్ హెయిర్ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత శాఖ నిబంధనల ప్రకారం దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది.
జైపూర్ ఘటన తర్వాత కారుణ్య నియామకాలపై అనేక అపోహలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకం వారసత్వ హక్కు కాదు, అలాగే అది ప్రతి కుటుంబానికి స్వయంచాలకంగా లభించే ఉద్యోగం కూడా కాదు. అదే విధంగా కారుణ్య నియామకంతో ఉద్యోగంలో చేరిన వితంతువు తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, కేవలం ఆ కారణంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగం రద్దు కాదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














