Last Updated:
దేశంలో పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థ లోపాలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులపై దాడులను ఖండిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
దేశంలో పదేళ్లలో 152 సార్లు పేపర్ లీక్ అయినా ఒక్కరికీ శిక్ష పడలేదని, విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేడు ఢిల్లీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత తరఫున ఆయన ప్రధానంగా మూడు కీలక డిమాండ్లను తెరపైకి తెచ్చారు. మొదటిది, వరుస పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రెండవది.. న్యాయబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులకు పాల్పడిన బాధ్యులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. ఇక మూడోది.. ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ గట్టిగా డిమాండ్ చేశారు. ఈ మూడు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆయన స్పష్టం చేశారు.
LoP Rahul Gandhi Ji drops 3 clear demands on Modi Govt:
1. Dharmendra Pradhan MUST resign
2. Police who assaulted students held accountable NOW
3. PM Modi should apologise to the studentsStudents deserve justice, not brutality. Stand with them! 🇮🇳#RahulGandhi…
— Amar Singh Chouhan (@amar_4inc) July 22, 2026
అసలు మన దేశ విద్యార్థులకు ఎందుకిలా జరుగుతోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చేసిన తప్పేంటని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. తమకు దక్కాల్సిన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై భద్రతా బలగాలు తుపాకులు ఎక్కుపెట్టడం దారుణమన్నారు. దేశ పౌరులుగా పారదర్శకమైన, న్యాయమైన విద్యావ్యవస్థను వారు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయక విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాహుల్ విచారం వ్యక్తం చేశారు. రేపు పరీక్ష ఉందనగా, ఈరోజు రాత్రికి రాత్రే పేపర్ లీక్ అయిందని చెప్పడం బాధాకరమన్నారు. పరీక్షల కోసం విద్యార్థులు అంతులేని ఒత్తిడికి గురవుతున్నారని, తీరా పరీక్ష సమయానికి లీకేజీ వార్తలు వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత పదేళ్లలో దేశంలో ఏకంగా 152 సార్లు వివిధ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని రాహుల్ గుర్తుచేశారు. ఇంత జరుగుతున్నా ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం దేశంలోని విద్యావ్యవస్థ పూర్తిగా అవకతవకలకు నిలయంగా మారిందని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














