Last Updated:
: హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే ఇరాన్పై తీవ్ర సైనిక చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వరుసగా 11వ రోజు కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు భీకర వైమానిక దాడులు కొనసాగించాయి.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు లేదా మరే ఇతర ఆయుధంతోనైనా నౌకలపై ఇరాన్ దాడి చేస్తే, దానికి ప్రతికారం తీవ్రంగా ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరంలో లేదా దాని చుట్టుపక్కల ఉన్న విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై బాంబులు వేసి ధ్వంసం చేస్తామని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ చేసిన ఈ ప్రకటన తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏప్రిల్లో ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో గత వారం నుంచి మళ్లీ భీకర దాడులు ప్రారంభమయ్యాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఈ పోరు సాగుతోంది.
From this point forward, any time the Islamic Republic of Iran shoots at a ship in the Strait of Hormuz, whether it be by Missile, Rocket, Drone, or any other device or weapon, the United States will bomb and destroy ONE BRIDGE OR POWER PLANT, including those located next to, or… pic.twitter.com/011kjiBiiX
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) July 22, 2026
ఇరాన్పై అమెరికా దళాలు వరుసగా 11వ రోజు కూడా దాడులు కొనసాగించాయి. హార్ముజ్ జలసంధిలోని లారక్ ద్వీపంపై అమెరికా క్షిపణితో దాడి చేసినట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ వెల్లడించింది. మధ్యాహ్నం 2:48 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలిపింది. ఈ దాడి వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ సృష్టిస్తున్న ఆటంకాలను అడ్డుకోవడానికే ఈ తాజా దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటాకామ్) అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో వాయు రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. వాయువ్య నగరమైన తబ్రీజ్, ఆగ్నేయ ఓడరేవులు చాబహార్, కొనారక్తో పాటు ఇరాన్ ఏకైక అణు విద్యుత్ కేంద్రం ఉన్న బుషెహర్ నగరంలో కూడా భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం అందుతోంది. తమ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ముందుగానే అమెరికాను హెచ్చరించింది.
నటాంజ్ సమీపంలోని భూగర్భ అణు కేంద్రంపై త్వరలోనే దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికా, దాని మిత్ర దేశాలపై ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్, ట్రంప్ తాజా వ్యాఖ్యలతో తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధ వాతావరణం నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














