Last Updated:
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ భారత్కు రానున్నారు. 2009 నాటి ఫెమా కేసులో ట్రిబ్యునల్ ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో, ఈ ఏడాది చివర్లో స్వదేశానికి వస్తానని ఆయన సంతోషంగా ప్రకటించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సృష్టికర్త, మాజీ చైర్మన్ లలిత్ మోదీ 16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇండియాలో అడుగుపెట్టనున్నారు. 2010లో దేశం విడిచి వెళ్లిన ఆయన, దశాబ్దానికి పైగా విదేశాల్లోనే ఉంటూ పలు న్యాయపరమైన విచారణలు ఎదుర్కొన్నారు. అయితే 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ టోర్నీకి సంబంధించిన ఫెమా (FEMA) కేసులో ట్రిబ్యునల్ ఇటీవల ఆయనకు భారీ ఊరటనిచ్చినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విధించిన జరిమానాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ పరిణామంతో లలిత్ మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
దాదాపు పదహారేళ్లుగా తాను సాగించిన న్యాయ పోరాటానికి సరైన ముగింపు లభించిందని, తాను చెప్పిందే నిజమని ఈ తీర్పు ద్వారా రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో తాను భారత్కు వస్తానని స్పష్టం చేశారు. అక్టోబర్లో తన కూతురు బిడ్డకు జన్మనివ్వనుందని, ఆ తర్వాత దేశానికి వస్తానని వివరించారు.
“నిన్న వెలువడిన ట్రిబ్యునల్ తీర్పు నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఈ రోజు నిరూపితమైంది,” అని మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాను ఎల్లప్పుడూ ఐపీఎల్ శ్రేయస్సు కోసమే పనిచేశానని, క్రికెట్ అభివృద్ధి మినహా తనకు వేరే స్వార్థం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ పీడకల లాంటి అధ్యాయం ముగిసిపోయిందని, ఇక తన జీవితంలో ఉత్సాహంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన కుటుంబ సభ్యులతో సమయం గడపడానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఊరట స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ చట్టం (SAFEMA) కింద ఉన్న అప్పీలేట్ ట్రిబ్యునల్ లలిత్ మోదీకి కీలక ఉపశమనం కలిగించింది. 2009లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసుకు సరైన ఆధారాలు లేవని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈడీ చేసిన ఆరోపణలను, విధించిన పెనాల్టీలను చాలా వరకు రద్దు చేసింది. దీంతో ఆయనపై ఉన్న అతిపెద్ద న్యాయపరమైన కేసుల్లో ఒకటి పూర్తిస్థాయిలో ఆయనకు అనుకూలంగా ముగిసినట్లు అయింది.
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ను ప్రారంభించిన ఘనత పూర్తిగా లలిత్ మోదీకే దక్కుతుంది. తొలి చైర్మన్గా ఈ టోర్నీని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన ప్రయాణం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అవినీతి, నిధుల దుర్వినియోగం, ప్రసార హక్కుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న తీవ్ర ఆరోపణలతో బీసీసీఐ (BCCI) ఆయనపై 2013లో జీవితకాల నిషేధం విధించింది. ఏ క్రికెట్ పాలక మండలిలోనూ ఆయన పదవులు చేపట్టకుండా బీసీసీఐ శాశ్వతంగా బహిష్కరించింది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














