Last Updated:
గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ చారిత్రక పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ త్వరలో భారత్లో పర్యటించే అవకాశం ఉంది. గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణ తర్వాత ఆయన మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) సమ్మిట్ 2026 కోసం ఆయన హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈ సదస్సును అత్యంత ఘనంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ జిన్పింగ్ భారత పర్యటనకు రావడం అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది.
2020లో జరిగిన సరిహద్దు వివాదం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు వేదికగా జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. గత కొంతకాలంగా సరిహద్దుల్లో శాంతి నెలకొల్పే దిశగా సైనిక కమాండర్ల స్థాయిలో వరుసగా పలు దఫాలు చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
జిన్పింగ్ చివరిసారిగా 2019 అక్టోబర్లో భారత్కు వచ్చారు. అప్పట్లో తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని మోదీతో కలిసి రెండో అనధికారిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆ పర్యటన ముగిసిన ఆరు నెలలకే లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా సైన్యం దురాక్రమణకు యత్నించింది. నాటి గాల్వన్ లోయ ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడంతో రెండు దేశాల సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఆ తర్వాత మోదీ, జిన్పింగ్ పలు అంతర్జాతీయ వేదికలపై ఎదురుపడినా అధికారికంగా ద్వైపాక్షిక చర్చలు జరపలేదు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జిన్పింగ్ మళ్లీ భారత్లో అడుగుపెట్టనున్నారు.
భారత అధ్యక్షతన జరుగుతున్న ఈ 18వ బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరుకానున్నారు. దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ఇదివరకే అధికారికంగా ధృవీకరించింది. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమ్మిట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత్, చైనా, రష్యా లాంటి అగ్ర దేశాల అధినేతలు ఒకే వేదికపైకి వస్తుండటంతో ప్రపంచ దేశాలన్నీ న్యూఢిల్లీ వైపు చూస్తున్నాయి.
ఈ ఏడాది బ్రిక్స్ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారత్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి ఈ సదస్సు ఒక కీలక వేదికగా నిలుస్తుందని చైనా అధికార ప్రతినిధి మావో నింగ్ స్పష్టం చేశారు. అయితే జిన్పింగ్ పర్యటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన రాక దాదాపు ఖాయమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














