Last Updated:
Arvind Kejriwal Instagram restriction: అరవింద్ కేజ్రీవాల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై ఆ సంస్థ ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఆయన.. మెటాను తప్పు పడుతున్నారు. కేంద్రానికి లొంగిపోయిందని ఫైర్ అవుతున్నారు. అసలేమైందో తెలుసుకుందాం.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్పై భారత్లో ఆంక్షలు విధించారని ఆరోపిస్తూ మెటా (Meta)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు (ఆగస్టు 6) X (మాజీ ట్విట్టర్)లో ఆయన ఓ పోస్ట్ చేశారు. తన అకౌంట్పై ఆంక్షలు ఎందుకు విధించారనే అంశంపై.. మెటా ఇండియా కార్యాలయంలో ప్రశ్నించినా, ఎన్ని ఈ-మెయిల్స్ పంపినా స్పష్టమైన సమాధానం రాలేదని ఆయన మండిపడ్డారు.
“హాయ్ @Meta @metaindia, నా ఖాతాపై ఎందుకు ఆంక్షలు విధించారు? మీ ఇండియా ఆఫీస్లో డైరెక్ట్ విచారణ చేస్తే నా ఖాతా భారత్లో రిస్ట్రిక్ట్ అయిందనీ, అందుబాటులో లేదని తెలిసింది. ఎందుకు? మీ ఆఫీస్లో ఎవరూ కారణాలు చెప్పడం లేదు. ఆంక్షలు ఎలా తొలగించాలో సూచనలు ఇవ్వడం లేదు. అన్ని ఈ-మెయిల్స్కూ రొటీన్ అక్నాలెడ్జ్మెంట్ మాత్రమే వచ్చింది. ఇది చాలా చెత్త సర్వీస్. మా ప్రధానికి అంతగా వంగకండి. చివరకు ఆయన తన ఖాతా మాత్రమే భారత్లో నడిపించేలా చేస్తారు” అని కేజ్రీవాల్ తన పోస్ట్లో సెటైర్లు వేశారు.
కేజ్రీవాల్ తన అకౌంట్ స్టేటస్ స్క్రీన్షాట్ను కూడా పంచుకున్నారు. అందులో “Unavailable in some locations” అని కనిపించింది. అయితే కంటెంట్ తొలగించలేదు, రీచ్ పరిమితం కాలేదు, అన్ని ఫీచర్లూ అందుబాటులో ఉన్నాయి, మోనిటైజేషన్ కూడా కొనసాగుతోందని స్క్రీన్షాట్ సూచిస్తోంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదని మాత్రమే అందులో ఉంది.
మెటా తాజాగా భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన తరుణంలో కేజ్రీవాల్ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల కోసం ఓ వీడియోని పోస్ట్ చేశారు. పేపర్ లీక్లపై చర్యలు తీసుకుంటామని చెప్పిన సెల్ఫీ వీడియో అది. ఫేస్బుక్లో దాన్ని కొన్ని గంటలపాటూ తాత్కాలికంగా తొలగించారు. మెటా దీన్ని టెక్నికల్ ఎర్రర్గా చెప్పింది. ఏఐ ఫిల్టర్లు తప్పుగా ఫ్లాగ్ చేయడం వల్ల ఇలా జరిగిందని వివరించింది.
ఆగస్టు 5న మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కాప్లాన్.. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి “ప్రధాని పోస్ట్ను రిస్ట్రిక్ట్ చేసిన ఎర్రర్కు మెటా తరఫున క్షమాపణలు చెబుతున్నాను” అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం మార్క్ జుకర్బర్గ్ కూడా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM), డీప్ఫేక్లు, ప్లాట్ఫామ్ ఆపరేషనల్ లోపాలపై క్షమాపణ చెప్పారు. మెటా పెయిడ్ ప్రమోషన్ల ద్వారా కొన్ని రకాల కంటెంట్ను యాంప్లిఫై చేసినట్లు అంగీకరించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. జుకర్బర్గ్.. 3 రోజుల్లో క్షమాపణ చెప్పాలనీ, లేదంటే సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోతారని హెచ్చరించింది.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రెండూ.. మెటా సంస్థవే. కేజ్రీవాల్ ఆరోపణలపై మెటా ఇప్పటివరకు అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే లైవ్మింట్ సంస్థ రిపోర్టు ప్రకారం ఆయన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఇప్పుడు భారత్లో సాధారణంగా అందుబాటులో ఉన్నాయి.
ఈ వివాదం మెటా-భారత ప్రభుత్వ సంబంధాల్లో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇన్స్టాగ్రామ్లో CSAM సంబంధిత ప్రకటనలు, డీప్ఫేక్లు, అల్గారిథమిక్ బయాస్, వెరిఫైడ్ ఖాతాలపై చర్యలు తీసుకునే ముందు సేఫ్గార్డ్స్ అవసరమని ప్రభుత్వం పదేపదే సూచిస్తోంది. మెటా గ్లోబల్ టీమ్ ఆగస్టు 5, 6న ఢిల్లీలో సమావేశాలు నిర్వహించింది.
మరోవైపు కేజ్రీవాల్ ఇటీవల ఈ20 పెట్రోల్ వివాదంపై కూడా చురుకుగా ఉన్నారు. 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ పాత వాహనాలకు నష్టం కలిగిస్తుందనీ, మైలేజీ తగ్గిస్తుందని ఆరోపిస్తూ ఆటో మేకర్లకు లేఖలు రాశారు. ప్రధాని ఇంటి వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో సిట్-ఇన్ నిర్వహించారు. పిటిషన్ వేసేందుకు రెండు లక్షలకు పైగా సంతకాలు సేకరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన సోషల్ మీడియా పోస్టులను నియంత్రించేందుకు మెటా ప్రయత్నిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అధికారికంగా అలాంటి లింక్ లేదు.
కేజ్రీవాల్ ఆరోపణలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల స్వేచ్ఛ, రాజకీయ పక్షపాతం, కంటెంట్ మోడరేషన్ విధానాలపై చర్చలను మళ్లీ రేకెత్తించాయి. మెటా ఇండియాలో కోట్ల యూజర్లను కలిగి ఉన్న ప్లాట్ఫామ్గా, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, అదే సమయంలో వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు మెటా కేజ్రీవాల్ ఆరోపణలపై ప్రత్యక్ష స్పందన ఇవ్వకపోవడం వల్ల.. సర్వీస్ నాణ్యతపై ప్రశ్నలు వస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 06, 2026 12:57 PM IST














