Last Updated:
మగాళ్లే భయపడే విపత్తులోకి.. ఆరేళ్ల పిల్లాడిని వదిలి ఎక్స్కవేటర్తో దూసుకెళ్లిన మహిళ.. అసలు కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు!
భారీ వరదలతో అస్సాం అతలాకుతలమైంది. శివసాగర్, చరైడియో జిల్లాల్లోని గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. రోడ్లు కనిపించకుండా పోవడంతో సహాయక బృందాలు సైతం అరటి బోదెల తెప్పలపై, మోకాలి లోతు బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తుంటే.. ఓ మహిళ మాత్రం ఊహించని విధంగా స్పందించింది. వరద గుప్పిట్లో చిక్కుకున్న వారిని ఆదుకునేందుకు నేరుగా ఓ భారీ ఎక్స్కవేటర్ను నడుపుకుంటూ విపత్తులోకి దూసుకెళ్లింది. ఆ సాహస వనితే తిన్సుకియా జిల్లా జాగూన్ ప్రాంతానికి చెందిన డాలీ గొగోయ్ చెటియా. కష్టకాలంలో తనదైన శైలిలో ముందుకొచ్చి ఎందరికో ఆశాకిరణంగా నిలిచింది.
న్యూస్18 అస్సాం ప్రతినిధి నిలోయ్ భట్టాచర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎగువ అస్సాంలో వచ్చిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇళ్లు బురదలో కూరుకుపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. నీరు తగ్గిన తర్వాత కూడా దట్టమైన బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇళ్లకు చేరుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో సాధారణ వలంటీర్లలా కేవలం ఆహార పొట్లాలు తీసుకువెళ్లడం కంటే బలమైన సహాయం అవసరమని డాలీ భావించింది. వాస్తవానికి ఆమె ఎక్స్కవేటర్లు, లోడర్లు, ఇతర భారీ వాహనాలను అద్దెకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తోంది. పురుషులకే పరిమితమైన ఈ రంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా, స్వయంగా యంత్రాలను ఆపరేట్ చేస్తూ సత్తా చాటుకుంటోంది. వరద వార్తలు విన్న వెంటనే తన యంత్రాలే బాధితులకు ప్రాణదాతలుగా మారుతాయని ఆమె బలంగా నమ్మింది.
సంతక్ అనే ప్రాంతానికి అంతకుముందు డాలీ ఎప్పుడూ వెళ్లలేదు. స్థానికంగా ఎక్స్కవేటర్లు, ట్రక్కులు అద్దెకు ఇప్పించాలని ఫేస్బుక్లో కోరగా, పలువురు స్పందించి సహాయం చేశారు. మొదట నిత్యావసరాలు పంచాలని వెళ్లినా, అక్కడి పరిస్థితి చూశాక ప్రజలను బురద నుంచి రక్షించడం అత్యవసరమని ఆమె గ్రహించింది. వెంటనే తన యంత్రాలను రంగంలోకి దించింది. రోడ్లపై పేరుకుపోయిన దట్టమైన మట్టిని తొలగించడం, బురదలో కూరుకుపోయిన ఇళ్లను బయటకు తీయడం, దారులు వేయడం ప్రారంభించింది. అందరూ అక్కడ విధ్వంసాన్ని చూస్తే, డాలీ మాత్రం తాను చేయాల్సిన పనిని చూసింది. నేపాలీ ఖుటీ, సంతక్ తదితర ప్రాంతాల్లో స్థానిక యువత, ఇద్దరు మహిళా వలంటీర్లతో కలిసి స్వయంగా ఎక్స్కవేటర్ నడుపుతూ అలుపెరగకుండా శ్రమించింది.
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి మట్టి దిబ్బల కింద కూరుకుపోయిన దాదాపు 30కి పైగా వాహనాలను డాలీ బృందం సురక్షితంగా బయటకు తీసింది. ఈ సేవా ప్రయాణంలో ఆమె మనసుకు హత్తుకున్న ఒక సంఘటన కూడా ఉంది. వరదల్లో భర్తను కోల్పోయిన ఓ మహిళ, బురదలో కూరుకుపోయిన తన ఇంట్లోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కన్నీరుమున్నీరవుతూ డాలీని ఆశ్రయించింది. పొరపాటున ఆ మహిళ ఫోన్ నంబర్ పోగొట్టుకున్న డాలీ, స్థానికుల సహకారంతో ఆమెను వెతికి పట్టుకుంది. స్వయంగా ఎక్స్కవేటర్తో వెళ్లి ఆ ఇంటి చుట్టూ ఉన్న బురదను పూర్తిగా తొలగించింది. భర్తకు గౌరవప్రదంగా కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఆ భార్యకు కల్పించినందుకు ఆమె ఎంతో సంతృప్తి చెందింది.
ఆరేళ్ల పిల్లాడికి తల్లి అయిన డాలీ వరద ప్రాంతాల్లో రోజుల తరబడి కష్టపడుతుంటే, ఆమె భర్త ఇంటి దగ్గర వ్యవసాయ వ్యాపారాలు చూసుకుంటూ ఆమెకు పూర్తి అండగా నిలిచాడు. మహిళలు అడుగుపెట్టడానికి భయపడే ఈ వృత్తిలో ఆమె రాణించడానికి అతడే ప్రధాన కారణం. తాను సాంప్రదాయ దుస్తులైన ‘మెఖేలా చాదర్’ ధరించి ఎక్స్కవేటర్ నడపడాన్ని ఎంతో ఇష్టపడతానని ఆమె సగర్వంగా చెబుతుంది. మెఖేలా చాదర్ అయినా, సల్వార్ కుర్తా అయినా ఒకే ఆత్మవిశ్వాసంతో వాహనం నడుపుతుంది. ప్రారంభంలో మహిళను కాబట్టి ఎంతోమంది తనను ఎగతాళి చేశారని, అవమానించారని ఆమె గుర్తుచేసుకుంది. ప్రతికూలతలను పట్టించుకోకుండా తన పనేంటో చేతల్లో చూపించి విమర్శకుల నోళ్లు మూయించింది.
సహాయక శిబిరాలు మూతపడి, టీవీ కెమెరాలు వెళ్లిపోయిన చాలా కాలం తర్వాత కూడా పునర్నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉంటాయి. రోడ్లు తెరవాలి, ఇళ్లు శుభ్రం చేయాలి, అప్పుడే మళ్లీ సాధారణ జీవితం మొదలవుతుంది. ఈ కష్టమైన రికవరీ దశలోనే డాలీ లాంటి వ్యక్తులు ఎంతో మార్పు తెస్తారు. నిజమైన హీరోలు ఎప్పుడూ సినిమాల్లోలా కేప్స్ (పై వస్త్రాలు) ధరించి రారు. కొన్నిసార్లు వారు మెఖేలా చాదర్ ధరించి, ఎక్స్కవేటర్ ఎక్కి, నేరుగా వరదల్లోకి దూసుకెళ్తారు. ఎందుకంటే అవతలి వైపు ఎవరైనా తమ జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి వారి సహాయం కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ప్రస్తుతం డాలీ అస్సాం ప్రజల పాలిట ఓ గొప్ప ఆశాకిరణంగా మారిపోయింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














