Last Updated:
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అనంత్ అంబానీని శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొల్లూరు దర్శనం అనంతరం ఆయన ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని కూడా సందర్శించి, కృష్ణ పరమాత్ముని సేవలో పాల్గొన్నారు.
Anant Ambani: ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ వారసుడు అనంత్ అంబానీ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి ఆలయాన్ని ఆయన ఈరోజు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు. తన కుటుంబ గురూజీతో కలిసి ఆలయానికి చేరుకున్న అనంత్ అంబానీకి ఆలయ అర్చకులు, యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అనంత్ అంబానీని శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కొల్లూరు దర్శనం అనంతరం ఆయన ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని కూడా సందర్శించి, కృష్ణ పరమాత్ముని సేవలో పాల్గొన్నారు.
దక్షిణాది ప్రముఖులకు కొల్లూరు క్షేత్రం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోంది. ఇటీవలే (గత శుక్రవారం) తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ కూడా కొల్లూరు మూకాంబికా ఆలయాన్ని సందర్శించారు. తమిళనాడు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇక్కడికి వచ్చిన విజయ్.. అమ్మవారికి ఒక ప్రత్యేక ఖడ్గాన్ని కానుకగా సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఆలయ బోర్డు తరఫున విజయ్ని ఘనంగా సన్మానించారు.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ, పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఉడుపి జిల్లాలోని కొల్లూరు మూకాంబికా ఆలయం ఒకటి. పరశురామ సృష్టిలోని ‘సప్త ముక్తి స్థలాల’లో ఇదొకటిగా విరాజిల్లుతోంది. కళలు, జ్ఞానానికి అధిదేవత అయిన మూకాంబికా దేవి ఇక్కడ కొలువై ఉంది. వాక్కు, అక్షరాలను ప్రసాదించే ఈ అమ్మవారి పంచలోహ విగ్రాహాన్ని, జ్యోతిర్లింగ స్వరూపాన్ని దర్శించుకుంటే భక్తులకు అపారమైన శక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయానికి దాదాపు 1200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది.
కొల్లూరు ఆలయ చరిత్రకు, అద్వైత వేదాంత ప్రతిపాదకులైన జగద్గురు ఆది శంకరాచార్యులకు అవినాభావ సంబంధం ఉంది. సరస్వతీ దేవి పరమ భక్తుడైన శంకరాచార్యుల భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై, తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని కోరుతుంది. శంకరాచార్యులు ఆలయ నిర్మాణం కోసం కేరళ వైపు అడుగులు వేయగా, అమ్మవారు ఆయన వెంటే వస్తానని అంగీకరిస్తుంది. అయితే, “నేను నీ వెనుక వచ్చేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు.. ఏ ప్రదేశంలో నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో, నేను అక్కడే స్థిరపడిపోతాను” అనే నిబంధన విధిస్తుంది.
అమ్మవారి నిబంధన ప్రకారం శంకరాచార్యులు ముందుకు నడుస్తుండగా, దేవి వెనుక వస్తూ ఉంది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత, అమ్మవారు వెనుక వస్తోందో లేదోననే సందేహంతో శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూస్తారు. దీంతో నిబంధన ప్రకారం అమ్మవారు కొల్లూరులోనే ఉండిపోవాలని నిశ్చయించుకుని, తన విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించమని సూచిస్తుంది.
శంకరాచార్యులు తన పొరపాటును క్షమించమని వేడుకోగా, శాంతించిన అమ్మవారు.. “ఉదయం వేళ కేరళలోని దేవాలయంలో కొలువై ఉంటానని, మధ్యాహ్న సమయానికి తిరిగి కొల్లూరు చేరుకుంటానని” వరమిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆది శంకరాచార్యులు కొల్లూరులో అత్యంత శక్తివంతమైన శ్రీచక్ర యంత్రంపై అమ్మవారి పంచలోహ (బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం) విగ్రహాన్ని ప్రతిష్టించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













