Last Updated:
Anvay Dravid: భారత క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వారసులు అన్వయ్ ద్రవిడ్, ఆర్యవీర్ సెహ్వాగ్ తమ తండ్రుల బాటలోనే క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని సత్తా చాటుతున్నారు.
శుక్రవారం ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన అనధికారిక వన్డే మ్యాచ్లో వీరిద్దరూ భారత్ అండర్-19 జట్టు తరఫున బరిలోకి దిగి రాణించారు. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మూడు వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్ ద్రవిడ్ 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. కేవలం 18 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 211.11 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్లో యశ్వర్ధన్ చౌహాన్తో కలిసి అన్వయ్ 34 బంతుల్లోనే 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి, భారత్ అండర్-19 జట్టు 182/6 స్కోరు సాధించడంలో దోహదపడ్డాడు. మరోవైపు, భారత్ అండర్-19 జట్టుకు అరంగేట్రం చేసిన ఆర్యవీర్ సెహ్వాగ్ ఇన్నింగ్స్ ఆరంభించి ఓపెనర్గా 26 బంతుల్లో 28 పరుగులు చేశాడు.
17 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ అన్వయ్ ద్రవిడ్ జూలై 2026లో శ్రీలంకతో జరిగిన రెండు యూత్ వన్డేల్లో కూడా ఆడాడు. తొలి మ్యాచ్లో 14 పరుగులు చేయగా, జూలై 6న హంబన్తోటలో జరిగిన రెండో మ్యాచ్లో 67 బంతుల్లోనే 87 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఓటమి చవిచూసింది.
తండ్రి సెహ్వాగ్లాగే టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన ఆర్యవీర్, గత నెలలో ముగిసిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026 ఎడిషన్లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడాడు. ఈ సీజన్లో రెండు మ్యాచ్ల్లో ఆడి 24 పరుగులు చేశాడు. అంతకుముందు డీపీఎల్ 2025లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున రెండు ఇన్నింగ్స్లలో 23 పరుగులు నమోదు చేశాడు. ఆర్యవీర్ తమ్ముడు వేదాంత్ కూడా క్రికెటరే కాగా, డీపీఎల్ 2026 ఎడిషన్లో అతడిని సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఎంపిక చేసినప్పటికీ ఇంకా అరంగేట్రం చేయలేదు.














