నా ఆప్త మిత్రుడిని కోల్పోయాను: పెద్ది మరణంపై KCR
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని ఆయన తీవ్ర ఆవేదన చెందారు. తెలంగాణ మలిదశ పోరాటంలో అలుపెరగని దీక్షతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. పోలీసు నిర్బంధాలు, జైలు శిక్షలకు ఏమాత్రం బెదరకుండా గులాబీ జెండా నీడలో నడిచిన పెద్ది పోరాట పటిమ ఆదర్శప్రాయమని కేసీఆర్ కొనియాడారు. ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని అధినేత భరోసా ఇచ్చారు.
ఇక పెద్ది మరణం బీఆర్ఎస్ పార్టీకి, యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. సుదర్శన్ రెడ్డి చూపిన నిబద్ధత, సేవా తపన కార్యకర్తలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు సైతం సుదర్శన్ రెడ్డి మరణంపై తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పెద్ది పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అగ్రనేతలు ప్రార్థిస్తూ, ఆ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు.













