Last Updated:
కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది.
కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA), కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC) ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులతో చర్చించిన ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించినట్లు డీఎన్ఏ కథనం పేర్కొంది. దీంతో సోమవారం నాడు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా సుప్రీంలో పిటిషన్ వేసింది.
జూలై 28న జరిగిన 139వ CWRC సమావేశంలో కర్ణాటకకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు, 15 రోజుల పాటు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల నీటిని బిలిగుండ్ల వద్దకు విడుదల చేయాలని సూచించారు. కృష్ణరాజ సాగర్ (KRS), కబిని రిజర్వాయర్ల నుంచి ఈ నీటిని వదలాల్సి ఉంది. ఈ నిర్ణయాన్ని జూలై 30న జరిగిన 54వ CWMA అత్యవసర సమావేశం కూడా ఆమోదించింది.
ఈ ఆదేశాలు ఉన్నప్పటికీ, జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య బిలిగుండ్ల వద్దకు కేవలం 158 నుంచి 550 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చిందని తమిళనాడు చెబుతోంది. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమావతి రిజర్వాయర్లలో కలిపి మొత్తం 77.537 టీఎంసీల (TMC) నీరు నిల్వ ఉందని, ఇందులో 67.517 టీఎంసీలు వాడుకోవడానికి వీలుగా ఉందని గుర్తుచేసింది. సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ తమ వాటా ఇవ్వడానికి కర్ణాటక నిరాకరిస్తోందని తమిళనాడు మండిపడింది.
వర్షాల కారణంగా ఇన్ఫ్లో పెరిగినందున, దామాషా పద్ధతిలో తమకు 26.954 టీఎంసీల నీరు రావాలని తమిళనాడు డిమాండ్ చేస్తోంది. కానీ CWMA కేవలం 4.536 టీఎంసీలు మాత్రమే కేటాయించడం చాలా తక్కువని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమకు రావాల్సిన పూర్తి నీటి వాటాను కర్ణాటక వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 03, 2026 10:22 PM IST














