Last Updated:
Chandipura Virus: గోధ్రాకు చెందిన 4 ఏళ్ల చిన్నారి ‘చండీపుర వైరస్’ లక్షణాలతో వడోదరలోని సయాజీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మరణించింది. చండీపుర వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోండి.
Chandipura Virus: గుజరాత్లో చండీపుర వైరస్ పట్ల ఆందోళనలు నెలకొన్న తరుణంలో చికిత్స కోసం వడోదరలోని సయాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో చిన్నారి మరణించింది. పంచమహల్ జిల్లాలోని గోధ్రాకు చెందిన నాలుగేళ్ల చిన్నారిలో చండీపుర వైరస్కు సంబంధించినవిగా భావిస్తున్న లక్షణాలు కనిపించాయి. చికిత్స నిమిత్తం ఆ చిన్నారిని వడోదరలోని సయాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
అయితే చికిత్స అందకముందే ఆ బిడ్డ మార్గమధ్యంలోనే మరణించింది. మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి నమూనాలను పరీక్ష కోసం పంపారు. ప్రస్తుతం ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పంచమహల్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు పిల్లలు చండీపుర వైరస్ ఇన్ఫెక్షన్ లక్షణాలతో సయాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఫిట్స్ (మూర్ఛ), విరేచనాలు , వాంతుల వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో వీరిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే వారి నమూనాలను పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపారు. వాటి నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
(ఇసుక ఈగ (sandfly))
చండీపుర వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ తల్లిదండ్రులకు సూచించింది. పిల్లలలో తీవ్రమైన జ్వరం, పదేపదే వాంతులు, ఒళ్లు నొప్పులు, నీరసం లేదా ఫిట్స్ (మూర్ఛ) వంటి లక్షణాలు కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వైరస్ సోకినప్పుడు రోగి పరిస్థితి చాలా వేగంగా క్షీణించే అవకాశం ఉంది.
చండీపుర వైరస్ అనేది మెదడు వాపునకు (ఎన్సెఫలైటిస్) దారితీసే ఒక తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది మొదట 1965లో మహారాష్ట్రలోని చండీపుర గ్రామంలో గుర్తించబడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఈ వైరస్ ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. సాధారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా 2 నుండి 16 ఏళ్ల వయస్సు గలవారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి ఇసుక ఈగల (sandflies) కాటు వల్ల కలుగుతుంది.
Chandipura Virus Symptoms
ఈ వైరస్ ప్రధానంగా ఇసుక ఈగ (sandfly) కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఈగలు సాధారణంగా రాత్రిపూట, తెల్లవారుజామున అత్యంత చురుకుగా ఉంటాయి. వ్యాధి సోకిన జంతువును కుట్టిన తర్వాత ఈ ఈగ మనిషిని కుడితే, ఆ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. వర్షాకాలంలో ఇసుక ఈగల సంఖ్య పెరగడం వల్ల ఈ వ్యాధి కేసులు కూడా పెరుగుతుంటాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి నేరుగా వ్యాపించదు.
చాండిపుర వైరస్ ప్రాథమిక లక్షణాలు సాధారణ వైరల్ జ్వరం లక్షణాలను పోలి ఉండవచ్చు. రోగులకు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, వాంతులు వంటి సమస్యలు కలగవచ్చు. అయితే 24 నుండి 72 గంటల వ్యవధిలోనే రోగికి ఫిట్స్ (మూర్ఛ) రావచ్చు.వారి పరిస్థితి విషమించవచ్చు. కాబట్టి అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అవసరం.
ఆరోగ్య నిపుణుల ప్రకారం రాత్రిపూట దోమతెరలను వాడటం, ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత పాటించడం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, గోడలకు ఉన్న పగుళ్లను పూడ్చడం, పిల్లలలో జ్వరం లేదా ఫిట్స్ (మూర్ఛ) వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














