Last Updated:
బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్కు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరి, బాధితుడి కుటుంబానికి అండగా నిలిచారు.
తోటి నటులు, సినీ పరిశ్రమ కార్మికులు ఆపదలో ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ బ్లాక్బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో అంత్యాక్షరి సీన్ ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేష్ ఇటీవల తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ బాధాకరమైన విషయం తెలిసిన వెంటనే స్పందించిన చిరంజీవి, అపోలో ప్రముఖ వైద్యుడు సుబ్బారెడ్డితో నిరంతరం సంప్రదింపులు జరిపారు.
రమేష్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అతనికి అత్యంత మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో ఉన్న బాధితుడి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన చిరంజీవి, తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం రమేష్ సతీమణికి రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అదనపు సాయం అందేలా చూస్తామని వారికి ధైర్యం చెప్పారు.
అదే సమయంలో, మెగా బ్రదర్ నాగబాబు సైతం ఈ కష్టసమయంలో రమేష్ కుటుంబానికి అండగా నిలిచారు. ఆయన రమేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందించారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిపి మొత్తం రూ. 5 లక్షల సాయం అందించడం పట్ల రమేష్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు, నటీనటులకు చిరంజీవి నిరంతరం అందిస్తున్న సహాయం చిత్ర పరిశ్రమలో మరోసారి స్ఫూర్తి నింపింది. సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్గాలు కూడా మెగాస్టార్ స్పందనను కొనియాడాయి. రమేష్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ అందరినీ అలరించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














