CM Revanth Reddy: కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా దక్కనివ్వను.. భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్! | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

జీవన్


Last Updated:

సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ 2034 వరకు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ధీమా, జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చేరికను మూర్ఖత్వంగా అభివర్ణించారు

+

జీవన్ రెడ్డిపై ధ్వజమెత్తిన సీఎం రేవంత్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. కాటారం మండలం నస్తుర్ పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సభా వేదిక నుంచి రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు.

అనంతరం సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ అందజేసిన తొలి పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. కేసీఆర్ 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందామంటూ సీఎం సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని లేకపోతే తన పేరు మార్చుకుంటానని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించి లూటీ చేసిన కేసీఆర్ ను ఉరి తీసిన తప్పు లేదన్నారు. ప్రజాస్వామ్యం అనేది లేకుంటే కేసీఆర్ ను అడవిలో చెట్టుకు ఉరి తీసే వారిని నిజాం పాలన ఉంటే కేసీఆర్ ను మొత్తం కక్కించేవారన్నారు. కేసిఆర్ ను పాపాల భైరవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాపాలన పోవాలి ఆ పాపాల భైరవుడి పాలన రావాలని జీవన్ రెడ్డి అనడం సిగ్గుచేటు అన్నారు. 1983లో నందమూరి తారక రామారావు జీవన్ రెడ్డిని పిలిచి మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచాక మంత్రి పదవి ఇస్తే సంవత్సరం తిరిగేలోపే ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. జీవన్ రెడ్డి ఇంతకాలం ముసుగు తొడుక్కొని బ్రతికారని ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత గౌరవం ఇచ్చిన ఆయన తీసుకున్న నిర్ణయం నిరాశ కలిగించిందని సీఎం పేర్కొన్నారు. జీవన్ రెడ్డి కుటుంబానికి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన పార్టీ వీడటాన్ని మూర్ఖత్వంగా అభివర్ణించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం పార్టీ నాయకత్వం అంతా కలిసి పని చేసిందని జగిత్యాల నుంచి నిజామాబాద్ వరకు ఆయనకు అండగా నిలిచామని గుర్తు చేశారు. పార్టీని వీడి కేసీఆర్ తో చేతులు కలపడం జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని వ్యాఖ్యానించారు.

జీవన్ రెడ్డి చరిత్ర అంతా తెలుసని 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 14 సార్లు జీవన్ రెడ్డికి బీఫామ్ అందజేసి గౌరవించిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే కార్యకర్తల గుండెలపై తన్ని శత్రువుల పంచన చేరుతారా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వెనుకున్న మచ్చలన్నీ తనకు తెలుసని ఆయన స్వార్థం కోసమే పార్టీ మారారని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలన మొదలై రెండున్నర ఏళ్లు అయిందని మరో దఫా కాంగ్రెస్ కే అవకాశం ఉంటుందని ప్రకటించారు. ప్రజా పాలన పోవాలి పాపాల భైరవుడు రావాలని జీవన్ రెడ్డి అంటున్నారని ఫామ్ హౌస్ లో పడుకునే పాపాల భైరవుడు ఎందుకు రావాలని ప్రశ్నించారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా మోస్తే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిందన్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీని పాతర పెట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *