Last Updated:
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. తాజాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రముఖ సినీ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఛైర్మన్ వెంకట్ కె. నారాయణను నియమిస్తూ టీవీకే (TVK) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. తాజాగా, దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ప్రముఖ సినీ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) ఛైర్మన్ వెంకట్ కె. నారాయణను నియమిస్తూ టీవీకే (TVK) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారని, విధులకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కర్ణాటకకు చెందిన వెంకట్ నారాయణ.. సీఎం విజయ్ కు అత్యంత సన్నిహితుడు. విజయ్ నటించిన చివరి చిత్రం, భారీ బడ్జెట్ మూవీ ‘జననాయగన్’ (Jana Nayagan) కు వెంకట్ నారాయణే నిర్మాత. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ రాకపోవడం, ఆన్లైన్ లీక్ వంటి వివాదాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. విజయ్ రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి, ముఖ్యంగా మే నెలలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆర్.వి. ఆర్లేకర్ ను కలిసిన సమయంలోనూ వెంకట్ ఆయన వెన్నంటే ఉన్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా విజయ్ కు అండగా నిలిచినందుకే, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న ఈ కీలక పదవిని ఆయనకు కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ నియామకంపై డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK), బీజేపీ (BJP) పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి మధ్య వారధి లాంటి వారని, కేంద్ర మంత్రులతో నిధుల కోసం సమన్వయం చేసుకోవడం, సీఎం ఢిల్లీ పర్యటనలు ఖరారు చేయడం, పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలకు సమాచారం అందిస్తూ అండగా ఉండాల్సిన కీలక బాధ్యత అని డీఎంకే ఎంపీ పి. విల్సన్ గుర్తుచేశారు. కనీస పరిపాలనా అనుభవం లేని ఒక సినీ నిర్మాతను ఈ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో హాస్యాస్పదంగా మార్చొద్దని హితవు పలికారు.
మరోవైపు, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కర్ణాటకకు చెందిన వ్యక్తిని తమిళనాడు ప్రతినిధిగా ఎలా నియమిస్తారని వారు ప్రశ్నించారు. ముఖ్యంగా కర్ణాటక – తమిళనాడు మధ్య ‘మేకేదాటు’ ఆనకట్ట వంటి జల వివాదాలు ఉన్న సమయంలో, ఒక కన్నడిగుడు తమిళనాడు ప్రయోజనాలను ఢిల్లీలో ఎలా కాపాడతాడని కనిమొళి నిలదీశారు. గతంలో విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడిని ముఖ్యమంత్రి కార్యాలయంలో నియమించి, విమర్శల పాలై ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వెంకట్ నియామకంపై వస్తున్న ఈ తీవ్ర వ్యతిరేకతకు విజయ్ ప్రభుత్వం ఎలా బదులిస్తుందో వేచి చూడాలి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













