Last Updated:
ఉత్తరప్రదేశ్ హమీర్పూర్లో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బు రూ.44 లక్షలు కాజేసేందుకు అమర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రీటాను దారుణంగా హత్య చేశాడు. కారుతో తొక్కిచ్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.44 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్ము కాజేసేందుకు అమర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రీటాను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. దాదాపు రెండు నెలల క్రితమే ఆమె పేరు మీద రూ.44 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసి, రూ.2.60 లక్షల మొదటి ప్రీమియం చెల్లించాడు. ఆ తర్వాత తన ముగ్గురు స్నేహితులతో కలిసి పక్కా పథకం ప్రకారం రీటాపై కర్రలతో దాడి చేసి, అనంతరం కారుతో తొక్కిచ్చి చంపేశాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి క్లెయిమ్ పొందాలని చూశాడు.
ఆపై ఏమీ తెలియనట్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి భార్య మిస్సింగ్ అంటూ నాటకమాడాడు. పోలీసుల విచారణలో తడబడటంతో అసలు నిజం బయటపడింది. నిందితుడిని, అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాల్పురా ప్రాంతంలోని బైత్కా ధామ్ ఆలయం వద్ద రీటా మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. ఆమె శరీరంపై 12కు పైగా తీవ్రమైన గాయాలు ఉన్నట్లు, మూత్రపిండాలు తప్ప దాదాపు అన్ని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రమాదంగా నమ్మించేందుకు కారుతో తొక్కించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
బాధితురాలు రీటాకు గతంలో మైన్పురి ప్రాంతానికి చెందిన సర్వేష్ కుమార్తో వివాహమైంది. మొదటి భర్త చనిపోవడంతో ఆమె కాన్పూర్ వచ్చారు. అక్కడ పిండిమిల్లులో పనిచేసే అమర్ సింగ్తో పరిచయం ఏర్పడి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. రీటాకు మొదటి భర్త ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆ పిల్లలు మైన్పురిలోని తమ తాతయ్య, నానమ్మల వద్ద ఉంటున్నారు.
భార్య కనిపించడం లేదంటూ నిందితుడే స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చాడని హమీర్పూర్ అదనపు ఎస్పీ అరవింద్ కుమార్ వర్మ తెలిపారు. విచారణలో అతడు చెప్పిన సమాధానాలు విరుద్ధంగా ఉండటంతో గట్టిగా ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడని చెప్పారు. ఈ కేసును ఛేదించి, నిందితుడితో పాటు అతని భాగస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Aug 02, 2026 10:19 PM IST














