Dengue vaccine: డెంగ్యూ మహమ్మారికి చెక్.. దేశంలోకి తొలి వ్యాక్సిన్.. 2027లో అందుబాటులోకి క్యూడెంగా! | | ACTPnews

News18


Last Updated:

భారతదేశంలో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ వచ్చే ఏడాది (2027) అందుబాటులోకి రానుంది. జపాన్‌కు చెందిన టకేడా ఫార్మాతో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాక్సిన్ నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది.

News18
News18

ప్రాణాంతక డెంగ్యూ జ్వరానికి చెక్ పెట్టేందుకు భారతదేశంలో తొలి వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. జపాన్‌కు చెందిన ప్రముఖ డ్రగ్ మేకర్ టకేడా ఫార్మాస్యూటికల్ తయారు చేసిన ‘క్యూడెంగా’ వ్యాక్సిన్ పంపిణీకి హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ప్రమోషన్, పంపిణీ బాధ్యతలను డాక్టర్ రెడ్డీస్ సంస్థ తీసుకోనుంది. ఈ ఏడాది జూలైలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) క్యూడెంగా వ్యాక్సిన్‌కు అధికారిక ఆమోదం తెలిపింది. అన్ని అనుమతులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది (2027) ప్రథమార్థంలో ఈ వ్యాక్సిన్ భారత మార్కెట్లో సామాన్యులకు అందుబాటులోకి రానుందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 100 మిలియన్ డోసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టకేడా సంస్థ ప్రకటించింది. ఈ ఒప్పందంతో దేశంలో డెంగ్యూ కట్టడికి బలమైన అస్త్రం దొరికినట్లేనని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

క్యూడెంగా వ్యాక్సిన్ ప్రత్యేకతలు

ఈ క్యూడెంగా వ్యాక్సిన్ మొత్తం నాలుగు రకాల డెంగ్యూ వైరస్ వేరియంట్లపై సమర్థవంతంగా పోరాడుతుంది. 4 నుంచి 60 ఏళ్ల వయసున్న పిల్లలు, పెద్దలు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా (0.5 ml చొప్పున) ఈ ఇంజెక్షన్ ఇస్తారు. గతంలో డెంగ్యూ వచ్చిందా లేదా అనే ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా ఈ టీకా వేయించుకోవచ్చు.

90 శాతం ఆసుపత్రి ముప్పునకు చెక్

తాజాగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలను నమోదు చేసింది. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత డెంగ్యూ కేసులను అడ్డుకోవడంలో 80.2 శాతం సమర్థతను కనబరిచింది. అలాగే ఆసుపత్రిలో చేరాల్సిన ముప్పును ఏకంగా 90.4 శాతం వరకు తగ్గించినట్లు అధ్యయనాలు స్పష్టం చేశాయి. వర్షాకాలంలో దోమల వృద్ధి పెరిగి డెంగ్యూ విజృంభించే భారత్ లాంటి దేశాలకు ఈ టీకా ఎంతో మేలు చేయనుంది.

గత రెండు దశాబ్దాల్లో దేశంలో డెంగ్యూ కేసులు ఏకంగా 11 రెట్లు పెరిగినట్లు టకేడా సంస్థ నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ (NCVBDC) గణాంకాల ప్రకారం, ఒక్క 2025లోనే దేశవ్యాప్తంగా 1,13,450 డెంగ్యూ కేసులు నమోదు కాగా 95 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతక పరిస్థితుల నేపథ్యంలో, క్యూడెంగా వ్యాక్సిన్ రాక దేశ ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్ద భరోసా ఇవ్వనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports