ESA 2026: ఆశలకు వేదికగా వాంఖడే.. ESA 2026తో 20 వేల మంది పిల్లలకు మరపురాని రోజు | క్రీడా వార్తలు | ACTPnews

ESA 2026: ఆశలకు వేదికగా వాంఖడే.. ESA 2026తో 20 వేల మంది పిల్లలకు మరపురాని రోజు | క్రీడా వార్తలు


ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం ఆ రోజు కేవలం అభిమానులతో నిండిన క్రీడా ప్రాంగణం కాకుండా, ఆశలు, ఆకాంక్షలు, అవకాశాల పండుగగా మారనుంది. ఈ మ్యాచ్‌కు సాధారణ టిక్కెట్ల విక్రయం ఉండదని నిర్వాహకులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో పిల్లల కోసం అంకితం చేసిన ప్రత్యేక మ్యాచ్‌డేగా దీనిని నిర్వహించనున్నారు.

16 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రత్యేక సామాజిక ఉద్యమం..

2010లో ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ (EFA) పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, 2018లో ‘ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్’గా విస్తరించింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ రూపకల్పన చేసిన ఈ కార్యక్రమం, క్రీడల ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యంత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సామాజిక ప్రభావ కార్యక్రమాలలో ESA ఒకటిగా నిలిచింది. గ్రామీణ, గిరిజన, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు క్రీడల ప్రపంచాన్ని దగ్గర చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది.

చిన్నారులకు జీవితంలో మరపురాని అనుభవం..

ఈ మ్యాచ్‌కు హాజరయ్యే చాలా మంది పిల్లలకు ఇది జీవితంలో తొలి పెద్ద అనుభవం కానుంది. తమ గ్రామాన్ని దాటి మొదటిసారి ప్రయాణం చేయడం, తొలిసారి ముంబై నగరాన్ని చూడడం, వాంఖడే వంటి ప్రపంచ స్థాయి స్టేడియంలో అడుగుపెట్టడం, స్టార్ క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడడం వంటి అనుభూతులు వారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనున్నాయి. ముంబైతో పాటు సతారా, నాసిక్, ఇగత్‌పురి, వల్సాద్, ఉద్వాడ వంటి గ్రామీణ, గిరిజన ప్రాంతాల నుంచి కూడా చిన్నారులు రానున్నారు. ఈ భారీ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి 40కి పైగా ఎన్జీఓలు భాగస్వామ్యం అవుతున్నాయి.

ESA 2026లో ప్రత్యేక అవసరాలు గల 200 మందికి పైగా పిల్లలు కూడా పాల్గొనడం విశేషం. వీరిలో నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ (ఇండియా) నుంచి 95 మంది దృష్టి లోపం ఉన్న చిన్నారులు ఉన్నారు. వారికి తోడుగా 35 మంది హియరింగ్ బడ్డీస్‌ను కూడా నియమించారు. ఈ స్థాయిలో దృష్టి లోపం ఉన్న పిల్లలను స్టేడియం అనుభవంలో భాగం చేయడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. సమ్మిళితత్వానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

భారీ స్థాయిలో ఏర్పాట్లు..

ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

500కి పైగా BEST, ప్రైవేట్ బస్సులు పిల్లల రవాణాకు వినియోగించనున్నారు

2,000 మందికి పైగా వాలంటీర్లు విధుల్లో పాల్గొననున్నారు

లక్షకు పైగా ఫుడ్ బాక్సులు, స్నాక్స్, పానీయాలు పంపిణీ చేయనున్నారు

650 మంది పోలీసులు, 300 మంది ట్రాఫిక్ సిబ్బంది భద్రత, ట్రాఫిక్ నిర్వహణ చేపట్టనున్నారు

ఇప్పటివరకు ESA ద్వారా 28 రాష్ట్రాల్లో 2.9 కోట్లకు పైగా పిల్లలు, యువత విద్యా మరియు క్రీడా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినట్లు నిర్వాహకులు తెలిపారు. “ఇది కేవలం మ్యాచ్ కాదు.. ఆశల వేడుక” గతంలో ESA సందర్భంగా మాట్లాడిన నీతా అంబానీ ఈ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌కు అత్యంత ఇష్టమైన మ్యాచ్‌డేగా అభివర్ణించారు. “ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు. ఆశలు, కలలు, ఆనందాల వేడుక. చాలా మంది పిల్లలకు ఇది స్టేడియంలో ప్రత్యక్ష మ్యాచ్ చూసే తొలి అనుభవం. వారి ముఖాల్లో కనిపించే ఆనందం ఎంతో భావోద్వేగానికి గురిచేస్తుంది,” అని ఆమె పేర్కొన్నారు. భారత క్రికెటర్లలో చాలామంది సాధారణ కుటుంబాల నుంచే ఎదిగారని, పిల్లలు కూడా పెద్ద కలలు కనాలని ఈ కార్యక్రమం ప్రేరణనిస్తోందని ఆమె అన్నారు.

MI చివరి లీగ్ మ్యాచ్‌కు ప్రత్యేకత..

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్‌కు ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం మరో ప్రత్యేకత. ఒకవైపు ప్లేఆఫ్ ఆశల నేపథ్యంలో మ్యాచ్‌కు ప్రాధాన్యం పెరుగుతుండగా, మరోవైపు వేలాది చిన్నారుల జీవితాల్లో స్ఫూర్తి నింపే వేదికగా ఇది నిలవనుంది. క్రికెట్‌ను సామాజిక సేవతో మేళవిస్తూ, ESA కార్యక్రమం ముంబై ఇండియన్స్ #OneFamily భావజాలానికి ప్రతీకగా కొనసాగుతోంది. ఈసారి కూడా వాంఖడేలో బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఎక్కువగా ఆశలు, అవకాశాలు, స్ఫూర్తి చర్చనీయాంశం కానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *