తెలంగాణలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా భారత్ ఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కీలక అడుగు వేస్తోంది. హైదరాబాద్లోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ హబ్ల నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ తొలి దశ ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు అవుతున్న నగరంలోని అతిపెద్ద పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ ప్రాజెక్ట్లలో ఇది ఒకటిగా నిలవనుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, హఫీజ్పేట్ రైల్వే స్టేషన్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఈ కొత్త ఛార్జింగ్ హబ్లు ఏర్పాటు చేస్తున్నట్టు భారత్ ఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ, మేనేజింగ్ పార్ట్నర్ ప్రద్యుమ్న ఏనుగుల న్యూస్18 తెలుగుతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం ఈ మూడు స్టేషన్ల పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోజూ ప్రయాణించే ప్రయాణికులు, నగరాల మధ్య తిరిగే వారు, ఫ్లీట్ ఆపరేటర్లకు హై-స్పీడ్ ఈవీ ఛార్జింగ్ సులభంగా అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అలాగే హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ఇది తోడ్పడుతుంది. (image: Bharat Charge)














