Last Updated:
హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.
హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా మాదన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని కొందరు దుండగులు నడిరోడ్డుపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేయగా, కులాంతర ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, చిన్నపల్లి భాస్కర్ గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్లో చెఫ్గా పనిచేస్తూ మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ సమీపంలోని ఓ హాస్టల్లో నివాసముంటున్నాడు. అతడు స్వగ్రామానికి చెందిన నిఖిత అనే యువతిని ప్రేమించాడు. అయితే ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వారి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. చివరకు మూడు సంవత్సరాల క్రితం ఆ యువతికి కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం జరిపించారు.
అయితే పెళ్లి తర్వాత ఆ యువతి దాంపత్య జీవితం సజావుగా సాగలేదు. భర్తతో తరచూ గొడవలు జరగడంతో చివరకు ఆమె విడాకులు తీసుకుంది. తన కుమార్తె వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడానికి గతంలో ప్రేమించిన భాస్కరే కారణమని యువతి తండ్రి రాజు అనుమానించి అతనిపై తీవ్ర కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా భాస్కర్ను చంపేస్తామని రాజు, అతని కుటుంబ సభ్యులు బెదిరించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఐదుగురు వ్యక్తులు మాదాపూర్లోని భాస్కర్ ఉంటున్న హాస్టల్కు వచ్చారు. “భాస్కర్తో మాట్లాడాలి” అని చెప్పడంతో అతడు హాస్టల్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే దుండగులు కత్తులు, కర్రలతో అతనిపై ఒక్కసారిగా దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన భాస్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి అన్న చిన్నపల్లి మధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యువతి తండ్రి రాజు, కుమారస్వామి, నాగరాజు, రాహుల్తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై భాస్కర్తో కలిసి పనిచేసిన సహోద్యోగులు కూడా షాకింగ్ విషయాలు వెల్లడించారు. “గత రెండేళ్లుగా భాస్కర్ మా వద్ద చెఫ్గా పనిచేస్తున్నాడు. అతని కోసం ఇంతకుముందు ఎవరూ రాలేదు. మంగళవారం రాత్రి కొందరు వచ్చి మాట్లాడాలని పిలిచారు. గేటు బయటకు వెళ్లగానే కత్తులతో దాడి చేశారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. ‘మా పరువు తీశావ్’ అంటూ విచక్షణారహితంగా పొడిచారు. కొద్ది నిమిషాల్లోనే భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడు” అని వారు తెలిపారు.
మరోవైపు మృతుడి అన్న మధు మాట్లాడుతూ, “ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ విషయం తెలిసిన తర్వాతే మా తమ్ముడిని హైదరాబాద్కు పంపించాం. అతడు గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువతికి పెళ్లి అయిన తర్వాత కూడా ఆమెనే మా తమ్ముడికి మెసేజ్లు చేసేది. అయినప్పటికీ మా తమ్ముడిపై తప్పుడు ఆరోపణలు చేసి కక్ష సాధించారు. నా తమ్ముడు ఎవరినీ బెదిరించలేదు. ఒకవేళ అలా చేసి ఉంటే ఆధారాలు చూపాలి. అనవసరంగా కక్ష పెంచుకుని అతడిని అత్యంత దారుణంగా హత్య చేశారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన మరోసారి పరువు హత్యలు, కులాంతర వివాహాల పట్ల సమాజంలో ఇంకా కొనసాగుతున్న విద్వేషాలను వెలుగులోకి తీసుకువచ్చింది.
Hyderabad,Telangana














