IIT Bombay: చాట్‌జీపీటీతో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు.. ఆ తర్వాత తీవ్ర విషాదం.. ఐఐటీ బాంబేలో ఘోరం! | | ACTPnews

ఐఐటీ బాంబే


Last Updated:

IIT Bombay: ముంబైలోని పొవాయ్ ప్రాంతంలో ఉన్న ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే క్యాంపస్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఐఐటీ బాంబే
ఐఐటీ బాంబే

శుక్రవారం జరిగిన పరీక్షలో మొబైల్ ఫోన్ ఉపయోగించినందుకు పట్టుబడిన ఓ రెండో సంవత్సరం బీటెక్ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. సమాధానాల కోసం ఆ విద్యార్థి ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీ (ChatGPT)కి అప్‌లోడ్ చేసినట్లు గుర్తించామని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. విద్యార్థిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదని, కోర్సు ఇన్‌స్ట్రక్టర్ మరియు విభాగాధిపతి (హెచ్‌ఓడీ) అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారని ఐఐటీ బాంబే యాజమాన్యం పేర్కొంది. ఈ సంఘటన వల్ల అతని విద్యా భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇచ్చినట్లు తెలిపింది. అయితే, అనంతరం తన హాస్టల్ గదికి వెళ్లిన విద్యార్థి అక్కడే బలవన్మరణానికి పాల్పడ్డాడు.

క్యాంపస్‌లో విద్యార్థుల ఆందోళన – పోలీసుల మోహరింపు

ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో క్యాంపస్‌లోని పలువురు విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. యాజమాన్యం జవాబుదారీతనం, పారదర్శకత వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) దత్తాత్రేయ్ నలవాడే వెల్లడించారు. “ఐఐటీ పొవాయ్‌లో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు నిరసనకు దిగారు. సమస్య పరిష్కారం కోసం ఐఐటీ యాజమాన్యం విద్యార్థులతో చర్చలు జరుపుతోంది. ఇవి విద్యార్థుల అంతర్గత పరిపాలనా సమస్యలకు సంబంధించిన అంశాలు” అని డీసీపీ తెలిపారు.

ప్రొఫెసర్ల తీరుపై విద్యార్థుల ఆగ్రహం

ఈ ఘటనపై నిరసనలో పాల్గొన్న ఓ విద్యార్థి మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. “ఈ ఏడాదిలోనే ఇది నాలుగో ఆత్మహత్య ఘటన. గత రెండు నెలల్లోనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇటువంటి వరుస ఘటనలకు గల కారణాలు విద్యార్థులకు అర్థం కావడం లేదు. విద్యార్థులతో కఠినంగా, దురుసుగా వ్యవహరించే ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలి. డైరెక్టర్, డీన్ ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇచ్చి బాధ్యత వహించాలి” అని డిమాండ్ చేశాడు.

మరోవైపు, ఇది ‘యాజమాన్యం వర్సెస్ విద్యార్థులు’గా మారకూడదని, అందరూ తీవ్ర మనస్తాపంలో ఉన్న ఈ సమయంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోకుండా ఐక్యంగా ఉండాలని మరికొందరు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విద్యార్థులు, అధికారుల మధ్య చర్చలు కొనసాగుతుండటంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports