Last Updated:
తూర్పు ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకున్నా.. సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
తూర్పు ఇండోనేషియాను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ విపత్తులో ఇప్పటివరకు కనీసం 38 మంది మరణించినట్లు స్థానిక రెస్క్యూ ఏజెన్సీ అధికారులు ధృవీకరించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. సముద్ర గర్భంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని ప్రభావంతో దేశంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో మీటరు కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే మూడు గంటల తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో ఆ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.














