Last Updated:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఇరాన్పై మరింత తీవ్రమైన దాడులు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిలిటరీని ఆదేశించారు. ఈ వారాంతంలోనే ఇరాన్కు చెందిన విద్యుత్, ఇంధన కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
కాల్పుల విరమణ కోసం ఒకపక్క చర్చలు జరుగుతుండగానే.. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్పై ‘కోలుకోలేని’ దాడులు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సుదీర్ఘ ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా, ఇరాన్ లొంగిపోయే వరకు ఈ దాడులు కొనసాగుతాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మేరీల్యాండ్లోని క్యాంప్ డేవిడ్లో శుక్రవారం జరిగిన అమెరికా కేబినెట్ సమావేశంలో ట్రంప్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము వారిని చాలా గట్టిగా దెబ్బతీయబోతున్నాం.. ఇక భరించలేమని వారు చేతులెత్తేసే వరకు ఈ దాడులు ఉంటాయి.. ఎలాగైనా ఈ యుద్ధంలో గెలవడమే మా లక్ష్యం” అని ట్రంప్ తేల్చిచెప్పారు.
దాడులకు సంబంధించి మిలిటరీ అధికారులకు ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా- ఇజ్రాయెల్ ఉమ్మడిగా ఈ దాడులు జరిపే అవకాశం ఉందన్న వార్తలతో ఆసియాలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ నేతల మాటల పట్ల తనకు నమ్మకం పోయిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. వారు పదేపదే అబద్ధాలు చెబుతూ, ఇచ్చిన మాట తప్పుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా “అత్యంత కఠినమైన బాంబు దాడులకు” ప్రణాళికలు రచిస్తున్నట్లు సీబీఎస్ న్యూస్ నివేదించింది. ఒకవేళ ఇదే జరిగితే.. గత కొన్ని వారాలుగా సైలెంట్గా ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్పై ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగినట్లు అవుతుంది. ప్రధానంగా ఇరాన్లోని రిఫైనరీలు, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉంది.
సోమవారం ఉదయం స్టాక్ మార్కెట్లు తెరుచుకునే సమయానికి ఈ దాడులు ముగించేలా అమెరికా ప్లాన్ చేస్తోంది. దీనికి కారణం ఆర్థిక మార్కెట్లు, చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న ఆందోళనే. దాడులకు సంబంధించి అమెరికా ఇప్పటికే ఇజ్రాయెల్కు సమాచారం ఇచ్చింది. అయితే ట్రంప్ నుంచి ఫైనల్ ఆర్డర్ రావడం మాత్రమే తరువాయి అని అధికారులు చెబుతున్నారు.
అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా దీటుగా స్పందించింది. ఒకవేళ తమ దేశ ఇంధన వనరులపై అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులు చేస్తే, దీటుగా బదులిచ్చేందుకు తమ వద్ద “సమగ్ర ప్రణాళిక” సిద్ధంగా ఉందని ఇరాన్ ఉన్నతాధికారి ఒకరు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీకి తెలిపారు. ఇరాన్పై దాడి చేయాలన్న అమెరికా ఆలోచనను ఆయన ‘పిచ్చితనం’గా అభివర్ణించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఏ క్షణమైనా మళ్లీ భీకర యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














