Last Updated:
IRCTC Ayodhya Kashi Tour | అయోధ్య, కాశీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. కేవలం 16 వేలకే 10 రోజుల యాత్రకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఆర్సీటీసీ టూరిజం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ పేరుతో మరో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో గయలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలు, గంగా హారతి, అయోధ్యలో రామ జన్మభూమి, హనుమాన్ ఘడి, ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం, బైద్యనాథ్లో బాబా బైద్యనాథ్ ఆలయం కవర్ అవుతాయి. ఈ టూర్ 9 రాత్రులు, 10 రోజుల పాటు సాగనుంది. జూలై 4న యాత్ర ప్రారంభం అవుతుంది. ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో మొత్తం 702 బెర్తులు ఉంటాయి. అందులో 160 స్లీపర్, 490 థర్డ్ ఏసీ, 52 సెకండ్ ఏసీ బెర్తులు ఉంటాయి. ఈ టూర్ ఎలా సాగుతుందో డీటెయిల్డ్గా తెలుసుకోండి.
ఐఆర్సీటీసీ టూరిజం కాశీ అయోధ్య యాత్ర మొదటిరోజు సికింద్రాబాద్లో ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్ జంక్షన్, చర్లపల్లి, కాజీపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మం, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్ స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. మొదటి రెండు రోజులు రైలు ప్రయాణం ఉంటుంది. మూడో రోజు ఉదయం గయ చేరుకుంటారు. లంచ్ తర్వాత విష్ణుపాద ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి బోధ్ గయలో బస చేయాలి. నాలుగో రోజు వారణాసి బయల్దేరాలి. సాయంత్రానికి వారణాసి చేరుకుంటారు.
ఐదో రోజు ఉదయం కాశీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతి చూడొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి. ఆరో రోజు అయోధ్యకు బయల్దేరాలి. అయోధ్యలో రామ జన్మభూమి, హనుమాన్ ఘడి చూడొచ్చు. ఏడో రోజు ప్రయాగ్ రాజ్ బయల్దేరాలి. అక్కడ గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం అయిన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయొచ్చు. ఆ తర్వాత జైసిధి బయల్దేరాలి. ఎనిమిదో రోజు బాబా బైద్యనాథ్ ఆలయ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తొమ్మిదో రోజు, పదో రోజు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడంతో టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే ఒకరికి స్లీపర్ క్లాస్కి రూ.16,400, థర్డ్ ఏసీకి రూ.25,500, సెకండ్ ఏసీకి రూ.33,100 చెల్లించాలి. ఒంటరిగా బుక్ చేసుకున్న ప్రయాణికులు, ఇతర బుకింగ్ల ద్వారా వచ్చే ప్రయాణికులతో కలిసి వసతిని పంచుకోవాల్సి ఉంటుంది. భారత్ గౌరవ్ రైలు పథకం కింద రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే సుమారు 33% రాయితీని కల్పిస్తోంది. పైన ఇచ్చిన ధరలు ఈ రాయితీతో కలిపే ఉన్నాయని గమనించాలి. ఈ టూర్ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్లో వసతి, వాహనంలో సైట్ సీయింగ్, టీ, శాకాహార భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, టూర్ ఎస్కార్ట్ సర్వీస్ కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను https://www.irctctourism.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













