శివ భక్తులకు ఐఆర్సీటీసీ (IRCTC) గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బయల్దేరి ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా 11 రోజుల ప్రత్యేక యాత్రను ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో ఈ యాత్ర సాగుతుంది. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, రోడ్డు రవాణా, భోజనం, టూర్ మేనేజర్ల సేవలు కూడా ప్యాకేజీలో ఉంటాయి. ‘సప్త (07) జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర’ పేరుతో ఈ టూర్ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న సికింద్రాబాద్ నుంచి యాత్ర మొదలై అక్టోబర్ 3న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు ఈ టూర్ కొనసాగుతుంది. ఈ యాత్రలో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని ఏడు ప్రముఖ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకలో నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, పూణె సమీపంలోని భీమాశంకర్ జ్యోతిర్లింగం, నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, ఛత్రపతి సంభాజీనగర్లోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఇవే కాకుండా ద్వారకాధీశ్ ఆలయం, బేట్ ద్వారక, ఓజర్లోని శ్రీ విఘ్నహర్ గణపతి ఆలయాన్ని కూడా టూర్లో చేర్చారు. (ప్రతీకాత్మక చిత్రం)














