Mulugu: దూడను కాపాడి.. మృత్యుఒడికి చేరిన తండ్రీకొడుకులు.. ప్రాణాలు తీసిన విషవాయువు.. ములుగు జిల్లాలో విషాదం | తెలంగాణ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

మానవత్వమే ఆ కుటుంబానికి శాపమైంది. లేగదూడను కాపాడే ప్రయత్నంలో తండ్రికొడుకులు ఊహించని విధంగా మృత్యువాత పడ్డారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన తండ్రి, చేతికందిన కొడుకు ఇద్దరూ ఒకేసారి మరణించడంతో ఆ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Mulugu: ఒక మూగజీవ ప్రాణాన్ని కాపాడాలనే మానవత్వం ఆ ఇంట తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన లేగదూడను రక్షించిన తండ్రీకుమారులు, అదే బావిలో ఊపిరాడక ప్రాణాలు విడిచిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు నింపింది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన తండ్రి, చేతికందిన కొడుకు ఇద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో ఆ గ్రామం కన్నీరుమున్నీరవుతోంది.

ఈనాడు కథనం ప్రకారం.. కర్లపల్లి గ్రామానికి చెందిన రోసపుల్ల రాజు (41) వృత్తిరీత్యా రైతు. ఆయన తన పశువుల పాక ఆవరణలో వ్యవసాయ పనులతో పాటు పశుపోషణ సాగిస్తుంటారు. శనివారం సాయంత్రం రాజుకు చెందిన ఒక లేగదూడ పశువుల పాక సమీపంలో ఉన్న పాత చేదబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. బావిలో నీరు ఉండటంతో దూడ మునిగిపోతుండటం గమనించిన రాజు, ఎలాగైనా దాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే బావి వద్దకు చేరుకుని, మోటారుకు అమర్చిన పైపు సాయంతో ప్రాణాలకు తెగించి లోపలికి దిగారు.

సాహసంతో దూడను రక్షించి..

బావి లోపలికి వెళ్లిన రాజు, దూడను పట్టుకుని దానికి తాడు కట్టారు. పైన ఉన్న ఆయన పెద్ద కుమారుడు పవన్‌కుమార్ (21) ఆ తాడును బలంగా పైకి లాగి, దూడను సురక్షితంగా బయటకు తీశాడు. దూడ ప్రాణాలతో బయటపడటంతో తండ్రీకొడుకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, అసలు ప్రమాదం ఆ తర్వాతే మొదలైంది. బావిలో ఉన్న తండ్రి రాజును బయటకు తీసేందుకు పవన్‌కుమార్ తాడును లోపలికి పంపాడు.

అంతుచిక్కని మృత్యుపాశం

రాజు ఆ తాడును తన నడుముకు కట్టుకుని పైకి వస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పట్టుతప్పి మళ్లీ బావిలో పడిపోయారు. లోపల పేరుకుపోయిన విషవాయువుల వల్ల రాజుకు అప్పటికే ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తండ్రి ఇబ్బంది పడటం గమనించిన పవన్‌కుమార్, ఆలస్యం చేయకుండా ఆయన్ని రక్షించేందుకు బావిలోకి దిగాడు. తండ్రి నడుముకు తాడు కట్టి పైకి పంపే ప్రయత్నం చేశాడు. అయితే, బావిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

సమాచారం అందుకున్న గ్రామస్థుడు ఈశ మల్లేష్ కూడా వారిని కాపాడేందుకు బావిలోకి దిగాడు. కానీ, లోపల శ్వాస తీసుకోవడం అసాధ్యంగా మారడంతో ప్రాణభయంతో వెంటనే పైకి వచ్చేసి, లోపల గాలి ఆడటం లేదని గ్రామస్థులకు తెలిపాడు. అంతలోనే రాజు, పవన్‌కుమార్ ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

మిన్నంటిన రోదనలు

గ్రామస్థుల సమాచారంతో పస్రా ఎస్సై దయాకర్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి శ్రమించి బావిలో నుంచి తండ్రీకుమారుల మృతదేహాలను వెలికితీశారు. పవన్‌కుమార్ తపాలా శాఖలో ఉద్యోగం చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. కుటుంబ పెద్దతో పాటు, ప్రయోజకుడైన కొడుకు కూడా మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. మూగజీవం కోసం ప్రాణాలర్పించిన ఆ తండ్రీకుమారుల త్యాగం చూసి గ్రామస్తులందరూ కంటతడి పెట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports