Last Updated:
పాకిస్థాన్లోని కోహట్ నగరంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మసీదు సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్లో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కోహట్ నగరంలో పట్టపగలే భారీ పేలుడు సంభవించి 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాత పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న ఒక మసీదు దగ్గర ఈ పేలుడు జరిగినట్లు స్థానిక అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఈ దుర్ఘటనలో మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాలు భయంతో దద్దరిల్లాయి. సమాచారం అందుకున్న వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు, రెస్క్యూ టీమ్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🚨Worshippers at the old Police Lines mosque #Kohat were attacked at Friday salah they were not at war, they were at prayer, yet TTP still treats mosques as targets and the Afghan Taliban still insist they give TTP no space if Kabul cannot stop men who bomb masjids, it is… pic.twitter.com/OwHrCbkTm6
— Uzma Shah (@UzmaShahw1) September 18, 2026
పేలుడు జరిగిన వెంటనే అప్రమత్తమైన అధికారులు జిల్లా ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భద్రతా బలగాలు పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సాధారణ ప్రజలు అటు వైపు వెళ్లకుండా కోహట్-హంగు ప్రధాన రహదారిని మూసివేసి ట్రాఫిక్ను దారి మళ్లించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
అయితే ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడా, లేక ఎవరైనా బాంబు అమర్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ఈ దాడికి బాధ్యత వహించలేదు. పాకిస్థాన్లో తరచూ ఇలాంటి దాడులు జరుగుతుండటంతో సాధారణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.














