Last Updated:
PM Modi: ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ‘ఇండియా ఫస్ట్’ విధానం, సమర్థవంతమైన దౌత్య సంబంధాల వల్లే దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా నివారించగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
రాజస్థాన్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. అంతర్జాతీయంగా తీవ్ర ఇంధన సంక్షోభం ఉన్నప్పటికీ.. నిరంతరాయంగా ఇంధన సరఫరాను కొనసాగిస్తూ, దేశ ప్రయోజనాలను కాపాడామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో ఎదురైన చమురు సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ ఇలా అన్నారు: “ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధరలు 40 శాతం వరకు పెరిగాయి. అయినప్పటికీ భారత్పై ఆ ప్రభావం పడకుండా చూశాం. దేశంలో పెట్రోల్ కొరత రాకుండా అడ్డుకున్నాం. ఇంధన కొరతపై కొన్ని శక్తులు పుకార్లు లేపినప్పటికీ అవి ఫలించలేదు. దేశంలో డీజిల్, పెట్రోల్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. సంక్షోభ సమయాల్లో మా దౌత్య నీతి అద్భుతంగా పనిచేసింది” అని ఆయన అన్నారు.
ప్రపంచ ఇంధన మార్కెట్లో భారతదేశ పాత్రను హైలైట్ చేస్తూ, దేశీయ అవసరాలను కాపాడుకుంటూనే, రిఫైన్డ్ ఇంధనాన్ని ఎగుమతి చేయగలిగామని చెప్పారు. “మేము 40 కంటే ఎక్కువ దేశాల నుండి ఇంధనాన్ని సేకరించాం. మాకు దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని ప్రపంచానికి చాటిచెప్పాం” అని ప్రధాని పునరుద్ఘాటించారు.
దేశీయంగా ఎల్పీజీ (వంటగ్యాస్) సరఫరా గురించి ప్రధాని మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నప్పటికీ భారత్లో వంటగ్యాస్ కొరత లేకుండా చూశామన్నారు. “అంతర్జాతీయ ధరల ప్రకారం చూస్తే దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 2,000 దాటాల్సింది. కానీ, మేము వినియోగదారులపై భారం పడకుండా కేవలం రూ. 950 లకే సిలిండర్ అందించాం. అలాగే ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలోని పేద ప్రజలందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లను అందించాం” అని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.
తన ప్రసంగం ప్రారంభంలో, సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వీరుల భూమి అయిన రాజస్థాన్లో ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయం సమృద్ధ భారత్) దిశగా ఒక కీలక అడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.
రిఫైనరీ ప్రాజెక్ట్: రాజస్థాన్లో ఏర్పాటు చేసిన రిఫైనరీ ప్రాజెక్టుపై హర్షం వ్యక్తం చేస్తూ అక్కడి యువతకు అభినందనలు తెలిపారు. గత రెండు నెలలుగా ఈ రిఫైనరీ పనులు అత్యంత వేగంగా జరిగాయని, ఇది కార్మికుల కష్టాన్ని ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు.
ఉద్యోగాల భర్తీ: ఈ వేదిక ద్వారానే ఈరోజు 54,000 మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను (Appointment Letters) అందజేసినట్లు ప్రధాని ప్రకటించారు.
జైపూర్ మెట్రో: జైపూర్ నగరంలో మెట్రో ప్రాజెక్టును మరింత విస్తరిస్తామని మోదీ హామీ ఇచ్చారు. చివరగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ.. తాము ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా బీజేపీ వదిలిపెట్టదని, అన్నింటినీ నెరవేర్చి తీరుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













