Last Updated:
బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా రాణించి ‘జన్ సూరజ్’ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. తన తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించారు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ స్థానంలో ఏకంగా 18 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.
బీహార్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి భారీ షాక్ తగిలింది. పట్నాలోని ప్రతిష్ఠాత్మక బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అద్భుత విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. మొత్తం 31 రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో కిషోర్కు 63,203 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి నీరజ్కు 44,250 ఓట్లు పోలయ్యాయి. ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి కేవలం 14,085 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ గెలుపుతో బీహార్ అసెంబ్లీలో జన్ సూరజ్ పార్టీ అధికారికంగా ఖాతా తెరిచింది. పార్టీ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టనున్న మొట్టమొదటి నాయకుడిగా ప్రశాంత్ కిషోర్ చరిత్ర సృష్టించారు.
తెలుగు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ పేరు సుపరిచితమే. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, ఆ తర్వాత 2019లో ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, 2021లో తమిళనాడులో స్టాలిన్కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి వారిని ముఖ్యమంత్రులను చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల దళపతి విజయ్ పార్టీకి కూడా ఆయన వ్యూహకర్తగా వ్యవహరించారు.
ఇలా ఎంతో మందిని అందలమెక్కించిన కిషోర్, తన సొంత రాష్ట్రం బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి జన్ సూరజ్ పార్టీని స్థాపించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కానీ, పట్టు వదలకుండా బంకీపూర్ ఉపఎన్నికలో స్వయంగా బరిలోకి దిగి తొలి విజయాన్ని నమోదు చేశారు.
బీహార్ రాజధాని పట్నా పరిధిలోని బంకీపూర్ నియోజకవర్గం 1995 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. దాదాపు 30 ఏళ్ల పాటు ఈ స్థానంలో కమలం పార్టీదే ఆధిపత్యం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు గెలుపొందారు. ఆయన ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఎవరూ కన్నెత్తి చూడలేని ఈ కంచుకోటలో పోటీకి దిగిన ప్రశాంత్ కిషోర్.. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీని మట్టికరిపించారు. కిషోర్ రాకతో ఈ ఎన్నిక త్రిముఖ పోరుగా మారి ఆసక్తికరంగా సాగింది.
ప్రశాంత్ కిషోర్ విజయం బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసింది. ఓటర్లు మార్పు కోరుకుంటున్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ గెలుపుతో జన్ సూరజ్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. భవిష్యత్తులో బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














