Last Updated:
కర్ణాటకలోని ఓ జ్యువెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన బంగారు నగలు మాయమవడంతో కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఎలుక గ్లూకు అతుక్కున్న నగలను ఈడ్చుకెళ్లిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటకలోని తుమకూరులో జరిగిన ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు ఎలుకలు ధాన్యం, నోట్లు లేదా ఇతర వస్తువులను కొరికిన సంఘటనలు చాలానే విన్నాం. కానీ ఈసారి ఏకంగా బంగారు నగలను ఈడ్చుకెళ్లిన ఘటన సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తుమకూరులోని విశ్వాస్ జ్యువెలరీ దుకాణంలో సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు నగలు రహస్యంగా కనిపించకుండా పోయాయి. అయితే దుకాణం తాళాలు పగలలేదు, ఎలాంటి చోరీ జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో దుకాణ యజమాని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా అందులో కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాడు.
ఫుటేజీలో ఓ ఎలుక బంగారు నగలు ఉంచిన ట్రే వద్దకు పలుమార్లు వచ్చి, ట్రేపై ఉన్న గ్లూ, ధర ట్యాగ్లను లాగేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో గ్లూకు అతుక్కున్న బంగారు ఉంగరాలు, గొలుసులు కూడా దానితో పాటు ఈడ్చుకుపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
దుకాణ యజమాని విశ్వాస్ న్యూస్ 18 కన్నడ కు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజూ వ్యాపారం ముగిసిన తర్వాత నగల లెక్కలు సరిచూసే అలవాటు ఉంది. మరుసటి రోజు దుకాణం తెరిచినప్పుడు 10కు పైగా బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించలేదు. మొదట ఇది దొంగతనమేనని భావించినా, సీసీటీవీ ఫుటేజీలో ఎవరూ దుకాణంలోకి ప్రవేశించకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.
రాత్రంతా రికార్డైన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఎలుక గ్లూ, ట్యాగ్లను కొరుకుతూ లాగిన సమయంలో వాటికి అతుక్కున్న బంగారు నగలు కూడా దానితో పాటు వెళ్లిపోయాయి. దీంతో వెంటనే దుకాణ నిర్మాణాన్ని పరిశీలించాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో ఓ ప్లైవుడ్ నిపుణుడిని పిలిపించి దుకాణంలోని ఫర్నిచర్, గోడల సమీప ప్రాంతాలను పరిశీలించారు. చివరకు కనిపించకుండా పోయిన అన్ని బంగారు నగలు అక్కడే లభించాయి. దీంతో దుకాణ యజమాని ఊపిరిపీల్చుకున్నాడు. అయితే ఈ ఘటనలో ఎలుక మాత్రం పట్టుబడలేదు.
సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు నగలు తిరిగి లభించినప్పటికీ, ఈ ఘటన నగల దుకాణాల్లో భద్రత, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్త అవసరమనే చర్చకు దారితీసింది. అనంతరం దుకాణ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు యజమాని తెలిపారు.
ఈ వింత సంఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు “ఇంత విచిత్రమైన దొంగతనం ఎప్పుడూ చూడలేదు” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు దీనిని “ఎలుక చేసిన అత్యంత ఖరీదైన దొంగతనం”గా అభివర్ణిస్తుండగా, మరికొందరు విలువైన వస్తువులు భద్రపరిచే ప్రదేశాల్లో పరిశుభ్రతతో పాటు భద్రతా ప్రమాణాలు కూడా మరింత కట్టుదిట్టంగా ఉండాలని సూచిస్తున్నారు.
Hyderabad,Telangana














