Reliance Foundation: భారత యువ ఫుట్‌బాలర్లకు గోల్డెన్ ఛాన్స్.. అంతర్జాతీయ నైపుణ్యం కోసం జపాన్‌కు తీసుకెళ్తున్న రిలయన్స్ ఫౌండేషన్ | క్రీడా వార్తలు | ACTPnews

Reliance Foundation: భారత యువ ఫుట్‌బాలర్లకు గోల్డెన్ ఛాన్స్.. అంతర్జాతీయ నైపుణ్యం కోసం జపాన్‌కు తీసుకెళ్తున్న రిలయన్స్ ఫౌండేషన్ | క్రీడా వార్తలు


జూలై 11 నుంచి 23 వరకు జపాన్‌లోని ఫుకుఓకా నగరంలో ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా భారత జట్లు అవిస్పా ఫుకుఓకా U18, సాగాన్ టోసు U18, గిరావాంజ్ కిటాక్యూషూ U18, ఎఫ్‌సీ బలైన్ షిమోనోసేకి U21 జట్లతో మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌ల ద్వారా భారత యువ ఫుట్‌బాలర్లు అత్యున్నత స్థాయి పోటీని ఎదుర్కొనే అవకాశం పొందడంతో పాటు భిన్నమైన ఆటతీరును, ఆసియాలో అత్యంత విజయవంతమైన ఫుట్‌బాల్ అభివృద్ధి వ్యవస్థలలో ఒకటైన జపాన్ విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

భారత మాజీ జాతీయ జట్టు కెప్టెన్, ప్రస్తుతం బెంగళూరు ఎఫ్‌సీ రిజర్వ్స్ హెడ్ కోచ్గా ఉన్న రెనెడీ సింగ్ మాట్లాడుతూ, “రిలయన్స్ ఫౌండేషన్ వల్ల ఈ సీజన్‌లో మేము 23 మ్యాచ్‌లు ఆడే అవకాశం పొందాం. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ ప్రత్యర్థులతో తలపడే అవకాశం దక్కింది. ఇది జట్లకు, కోచ్‌లకు, ఆటగాళ్లకు గొప్ప వేదిక” అని అన్నారు.

ఎఫ్‌సీ గోవా డెవలప్‌మెంట్ టీమ్ హెడ్ కోచ్ ఇజ్రాయిల్ గురుంగ్ మాట్లాడుతూ, “బలమైన గ్రాస్‌రూట్ వ్యవస్థ కారణంగా జపాన్ ఆసియాలోనే కాదు ప్రపంచ ఫుట్‌బాల్‌లో కూడా శక్తివంతమైన దేశంగా ఎదిగింది. అక్కడి ఫుట్‌బాల్ నాణ్యతను ప్రత్యక్షంగా చూడటం మా ఆటగాళ్లకు ఎంతో విలువైన అనుభవం. అభివృద్ధి దశలో ఉన్న యువ ఆటగాళ్ల ఎదుగుదలకు ఇలాంటి అవకాశాలు ఎంతో ఉపయోగపడతాయి” అని తెలిపారు.

2024లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన యూకే ఎక్స్‌పోజర్ టూర్‌లో పాల్గొని ఎవర్టన్ ఎఫ్‌సీ, ఆస్టన్ విల్లా వంటి క్లబ్‌లపై విజయాలు సాధించిన పంజాబ్ ఎఫ్‌సీ ఈసారి కూడా జపాన్ పర్యటనలో భాగం కానుంది. ఈ సందర్భంగా పంజాబ్ ఎఫ్‌సీ యువజట్టు హెడ్ కోచ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “జపాన్ యువ ఫుట్‌బాల్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంటుంది. గతంలో యూకే పర్యటన ద్వారా మా ఆటగాళ్లకు మంచి అనుభవం లభించింది. రిలయన్స్ ఫౌండేషన్ యువ ఫుట్‌బాల్ నుంచి సీనియర్ స్థాయికి మధ్య ఉన్న అంతరాన్ని పోటీలు, అంతర్జాతీయ పర్యటనల ద్వారా తగ్గిస్తోంది. జపాన్‌లో సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలమైన జట్లతో ఆడటం మా ఆటగాళ్లకు మంచి సవాలు, గొప్ప అభ్యాస అవకాశంగా ఉంటుంది” అని చెప్పారు.

గత కొన్ని సంవత్సరాలుగా RFDL జట్లు ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ యువజట్లతో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు జపాన్ పర్యటన ద్వారా అంతర్జాతీయ అనుభవాన్ని మరింత విస్తరించే దిశగా మరో ముందడుగు పడింది. ఆసియాలో అగ్రశ్రేణి ఫుట్‌బాల్ దేశమైన జపాన్‌తో పోటీ ద్వారా భారత యువ ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చుకునే అవకాశం పొందనున్నారు.

ఆటగాళ్ల అభివృద్ధితో పాటు కోచ్‌ల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇస్తూ, పాల్గొనే మూడు క్లబ్‌ల నుంచి ఆరుగురు కోచ్‌లకు అవిస్పా ఫుకుఓకాలో ప్రత్యేకంగా మూడు రోజుల కోచ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. ఇందులో ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్ ప్లాన్స్, ఆటగాళ్ల పురోగతి, హై-పర్‌ఫార్మెన్స్ వాతావరణంపై శిక్షణతో పాటు, కేవలం మూడు సంవత్సరాల్లో J2 లీగ్ నుంచి AFC ఛాంపియన్స్ లీగ్ ఎలైట్ ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లిన ఎఫ్‌సీ మచిదా జెల్వియా ఫుట్‌బాల్ డైరెక్టర్‌తో పరస్పర చర్చలు కూడా ఉంటాయి.

ఫుట్‌బాల్‌తో పాటు జపాన్ సంస్కృతి, చరిత్రను పరిచయం చేసే కార్యక్రమాలు కూడా ఈ పర్యటనలో భాగం కానున్నాయి. బృందం నాగసాకి పీస్ స్టేడియం, అటామిక్ బాంబ్ మ్యూజియం, డజైఫు టెన్మాంగు ఆలయంలను సందర్శించనుంది. ఆటగాళ్లు, కోచ్‌ల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న రిలయన్స్ ఫౌండేషన్ విధానానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

జపాన్ ఎక్స్‌పోజర్ టూర్ ద్వారా రిలయన్స్ ఫౌండేషన్ డెవలప్‌మెంట్ లీగ్ భారత ఫుట్‌బాల్ భవిష్యత్తును తీర్చిదిద్దే కీలక వేదికగా మరింత బలపడుతోంది. దేశీయ స్థాయిలో నాణ్యమైన పోటీలు, అంతర్జాతీయ అనుభవం, కోచ్‌లకు ప్రత్యేక శిక్షణ వంటి అంశాలను సమన్వయం చేస్తూ యువ ఆటగాళ్లు, కోచ్‌లను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు సిద్ధం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. యువ ఫుట్‌బాల్‌లో జపాన్ సాధించిన నిరంతర విజయాలు భారత తదుపరి తరం ఫుట్‌బాలర్లకు ఆదర్శంగా నిలుస్తూ, అత్యున్నత స్థాయిలో పోటీపడేందుకు మార్గం చూపనున్నాయి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports