Last Updated:
Siddaramaiah Resigns: సిద్ధరామయ్య రాజీనామా జస్ట్ రాజీనామా కాదు.. అది కర్ణాటక రాజకీయాలపై అనుకూల, వ్యతిరేక ప్రభావాల్ని చూపించగలదు. ఓటర్లు ఈ నిర్ణయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కీలక అంశం.
కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ సీఎంగా ఉన్న సిద్ధరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రెటరీకి సమర్పించారు. ఆయనతోపాటూ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు. నెక్ట్స్ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేవరకూ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉండబోతున్నారు.
రాజీనామాకి ముందు.. సిద్ధరామయ్య.. తన ప్రాతినిధ్య నియోజకవర్గంలో మద్దతుదారుల్ని కలిశారు. భావోద్వేగానికి లోనయ్యారు. దాంతో వరుణ అసెంబ్లీ నియోజకవర్గం లోని కావేరీ నివాసంలో భావోద్వేగ దృశ్యం కనిపించింది. సిద్ధరామయ్య రాజీనామా చెయ్యబోతున్నారని తెలిసి.. మద్దతుదారులు ఆ ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నిర్ణయం మద్దతుదారులకు నచ్చకపోయినా.. హైకమాండ్ ఆదేశాలతో ఇది జరిగింది.
“అందరికీ నమస్కారం. రాజీనామాను లోక్ భవన్లో సమర్పించాను. గవర్నర్ అందుబాటులో లేరు. అందువల్ల కార్యదర్శికి సమర్పించాను. హైకమాండ్ కోరినప్పుడు రాజీనామా సమర్పిస్తానని నేను చాలాసార్లు చెప్పాను. మొన్న హైకమాండ్ నన్ను రాజీనామా చేయమని అడిగింది. నేను ఎల్లుండి సమర్పిస్తానని వారికి చెప్పాను. (అంటే ఈ రోజు). అందువల్ల, నేను దానిని సమర్పించాను” అని సిద్ధరామయ్య తెలిపారు.
రాజీనామా లేఖను సమర్పించిన సిద్ధరామయ్య.. నెక్ట్స్ ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. శుక్రవారం ఆయన.. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలైన సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని కలిసి.. ధన్యవాదాలు చెప్పబోతున్నారు.
ఇప్పటివరకూ అంతా సవ్యంగానే సాగింది. శుక్రవారం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో.. డీకే శివకుమార్ని తమ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ప్రమాణం చేశాక.. మళ్లీ కొత్త కేబినెట్ ఏర్పడుతుంది. ఇదంతా ఓకే.. మరి ఈ పరిణామాలు.. నెక్ట్స్ 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?
సిద్ధరామయ్య మొదట్లో జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినా.. పార్టీలో కీలక నేతగా మారారు. ఆయన ప్రధానంగా అహిందా, దళిత, మైనారిటీలకు ప్రతినిధిగా ఎదిగారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సోషల్ ఇంజినీరింగ్ ప్రచారం చేస్తోంది. పదవుల్లో అన్ని వర్గాల వారికీ సమానత్వం ఉండాలని రాహుల్ అంటున్నారు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఓబీసీ నుంచి సీఎంగా ఉన్నది సిద్ధరామయ్య మాత్రమే. ఇప్పుడు ఆయన రాజీనామా చెయ్యడం వల్ల.. సోషల్ ఇంజినీరింగ్ కాన్సెప్ట్ దెబ్బతిన్నట్లు అవుతుంది. ఇది బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. అందువల్ల ఈ విమర్శను కాంగ్రెస్ హైకమాండ్ ఎదుర్కొనే సవాలు ఉంది.
శివకుమార్ వొక్కలింగ సమాజం నుంచి వచ్చారు కాబట్టి.. ఆ వర్గం ఓటు బ్యాంకును ఆయన పొందే వీలుంది. కర్ణాటకలో వొక్కలింగ ఓటర్లు ఎక్కువే. అందువల్ల ఆయన సీఎంగా నెక్ట్స్ ఎన్నికల నాటికి తన మార్క్ చూపించడం ద్వారా.. తిరిగి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐతే.. ఇక్కడో సవాలు ఉంది. డీకేకి మొదటి నుంచి పార్టీని ముందుకు నడిపించే పట్టు ఉంది. ఆయన సీఎం అయితే.. పార్టీని నడిపించే వారు ఎవరన్న ప్రశ్న వస్తుంది. సిద్ధరామయ్య.. ఈ బాధ్యతను తీసుకునేందుకు ఆసక్తిగా లేరు. హైకమాండ్ ఇలా కోరినా.. ఆయన ఆసక్తి చూపలేదని సమాచారం. అంటే.. 2028లో పార్టీని నడిపించే సవాలు కాంగ్రెస్ ముందు ఉండనుందని అనుకోవచ్చు.
మరోవైపు బీజేపీ ఈ పరిణామాల్ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో 2028లో అధికారంలోకి రావాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నారు. బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ తరహాలో కర్ణాటకలో కూడా భారీ ప్రచారం, వ్యూహాలతో కాంగ్రెస్కి షాక్ ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం రెడీ అవుతోంది. ఇవన్నీ గమనిస్తున్న కాంగ్రెస్.. ఈ కుర్చీ మార్పు గేమ్లో హడావుడి లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. తద్వారా.. సీఎం పదవి కోసం కుర్చీలాట సాగుతోంది అని బీజేపీ విమర్శించే ఛాన్స్ లేకుండా చూసుకుంటోంది.
కర్ణాటక ప్రజలు ఐదేళ్లకోసారి పార్టీలను మార్చేస్తున్నారు. అందువల్ల మళ్లీ కాంగ్రెస్కి ఛాన్స్ ఇస్తారా అనేది సందేహమే. ఉన్న రాష్ట్రాలను కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తన పట్టును చూపలేకపోతోంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నామమాత్ర పార్టీగా మారింది. అందువల్ల కర్ణాటకను చేజార్చుకుంటే పెద్ద సమస్యే. కాబట్టి.. నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తి రేపనున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













