Snakes: చైనా వరదల్లో తప్పించుకున్న 900 నాగుపాములు.. పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ తిప్పలు | | ACTPnews

News18


Last Updated:

Snakes: చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో ‘మేసాక్’ తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించింది. దీనివల్ల వీధుల్లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తున్నాయి. పాములను పెంచే ప్రాంతాన్ని ఈ వరదలు ముంచెత్తాయి. వరద నీళ్లలో అనేక విషపూరితమైన నాగుపాములతో సహా సుమారు 900 పాములు బయటకు వచ్చాయి.

News18
News18

China Snake Attack News: మేసాక్ తుఫాను వలన సంభవించిన వరదలు చైనాలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈసారి వరదలు కేవలం ఇళ్లను, రోడ్లను కొట్టుకుపోవడమే కాకుండా ఒక పాముల బాంబును కూడా విసిరాయి. తుఫాను తరువాత దక్షిణ చైనాలోని హెంగ్‌జౌ నగరంలో విషపూరితమైన పాములు అకస్మాత్తుగా అన్నీ చోట్ల ప్రత్యక్షమయ్యాయి. ఈ పాములను దశాబ్దాలుగా ఔషధ , ఆహార వ్యాపారాల కోసం పెంచుతున్నారు. అవి ఇప్పుడు స్వేచ్ఛగా సంచరిస్తూ మానవ ప్రాణాలకు ముప్పుగా మారాయి. వరద నీటితో పాటు సుమారు 900 పాములు అందులో అనేక విషపూరితమైన నాగుపాములు కూడా ఉన్నాయి. పొలాలు, ఇళ్లు , రోడ్ల మీదకు వచ్చి చేరాయి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే రాత్రిపూట ఇళ్ల నుండి బయటకు రావద్దని స్థానిక అధికారులు ప్రజలను కోరుతున్నారు.

పాములను పెంచుతారు..

హెంగ్‌జౌ చైనా ‘జాస్మిన్ రాజధాని’గా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ జాస్మిన్ టీ తయారీ కోసం ఇక్కడ గత 500 ఏళ్లుగా జాస్మిన్ (మల్లె) సాగు చేస్తున్నారు. అయితే ఇటీవలి దశాబ్దాలలో ఈ ప్రాంతం మరో కారణంతోనూ గుర్తింపు పొందింది. అదేమిటంటే పాముల పెంపకానికి చైనాలోనే అతిపెద్ద కేంద్రంగా మారింది. వియత్నాం సరిహద్దులో ఉన్న గ్వాంగ్సీ (Guangxi) ప్రావిన్స్‌లో 100కు పైగా పాముల జాతులు కనిపిస్తాయి. 2020 నాటికి ఆ ప్రాంతంలో సుమారు 2 కోట్ల పాములు, 14,000కు పైగా పాముల పెంపక కేంద్రాలు ఉండేవి. గతంలో వీటిని ఆహారం కోసం పెంచినప్పటికీ ప్రస్తుతం చాలా వరకు పాములను ఔషధ అవసరాలు, బయోమెడికల్ పరిశోధనల కోసం పెంచుతున్నారు.

మేసాక్ తుఫాను బీభత్సం..

భారీ వర్షాలు వరదల కారణంగా అనేక పాముల పెంపక కేంద్రాల గోడలు బద్దలయ్యాయి. క్షణాల్లో వందలాది పాములు తప్పించుకున్నాయి. చైనీస్ కోబ్రాలు, కట్లపాములు, పచ్చపాముల వంటి ప్రమాదకరమైన పాములు బయటకు వచ్చాయి. వరద నీటిలో పాములు ఈదుతున్న దృశ్యాలున్న అనేక వీడియోలు వెలుగులోకి వచ్చాయి. CNN నివేదిక ప్రకారం వరదల కారణంగా ఇప్పటివరకు 39 మంది మరణించారు. వారిలో ఒక మహిళ పాము కాటు వల్ల మరణించింది. ఒక ఫారం నుండి తప్పించుకున్న నాగుపాము ఆమెను కాటు వేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

జూలోంచి తప్పించుకున్న జంతువులు..

వరద ప్రభావం కేవలం పాముల క్షేత్రాలకే పరిమితం కాలేదు. గుయిగాంగ్ జంతుప్రదర్శనశాల నుండి రెండు జీబ్రాలు, ఒక మూపురం గల ఎద్దు, మూడు పోనీలు, రెండు గాడిదలు, ఉష్ట్రపక్షులు, ఎమువులు , రకూన్‌లతో సహా పలు జంతువులు తప్పించుకున్నాయి. జంతుప్రదర్శనశాల సిబ్బంది సింహాల ఆవరణలను భద్రపరచడానికి , జంతువులు బయటకు రాకుండా నిరోధించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. మూడు సింహాలు వరద నీటిలో మునిగి చనిపోయాయి. నివేదికల ప్రకారం జంతుప్రదర్శనశాల యజమాని యిన్ ఫీఫీ ఇలా అన్నారు.. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహార జంతువులను తప్పించుకోనివ్వలేదని అలా చేయడం వల్ల మనుషుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయని తెలిసే జాగ్రత్తపడ్డామన్నారు.

రెండు రోజుల్లో 3,000 పాములు పట్టివేత..

ఇప్పుడు ఈ పాములను తిరిగి పట్టుకోవడమే అత్యంత కష్టమైన పనిగా మారింది. స్థానిక పాములను పట్టుకునే బృందానికి చెందిన జు (Zhu) మాట్లాడుతూ తమ 7-8 మంది సభ్యుల బృందం వరుసగా రెండు రోజుల పాటు అవిశ్రాంతంగా పనిచేసిందన్నారు. కేవలం రెండు రోజుల్లోనే 2,000 నుండి 3,000 పాములను పట్టుకున్నట్లుగా తెలిపారు. వీటిలో ఎక్కువ భాగం ఎలుక పాములు (rat snakes) అయినప్పటికీ విషపూరితమైన పాములు కూడా లభించినట్లుగా వెల్లడించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports