Sonam Wangchuk: 26 రోజుల తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ! నేడు చర్చలు | | ACTPnews

సోనమ్ వాంగ్‌చుక్


Last Updated:

Sonam Wangchuk: NEET ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

సోనమ్ వాంగ్‌చుక్
సోనమ్ వాంగ్‌చుక్

దేశంలో హింస చెలరేగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో, ప్రభుత్వం నుంచి లభించిన హామీల మేరకు ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురువారం అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

చకచకా ప్రభుత్వ నిర్ణయాలు

విద్యార్థుల ఆందోళన ఉధృతం కావడం, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం, రాత్రి రెండుసార్లు పరిస్థితిపై స్పందించిన ప్రధాని.. లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రధాని ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది:

ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నోటిఫై: NEET పేపర్ లీకేజీలపై వేగవంతమైన క్రిమినల్ విచారణ జరిపేందుకు దిల్లీ హైకోర్టు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాన్ని నోటిఫై చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పనిచేసే ఈ ప్రత్యేక కోర్టుకు అను గ్రోవర్ బలిగను న్యాయాధికారిగా నియమించారు.

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బదిలీ: వివాదం నేపథ్యంలో కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను పంచాయతీ రాజ్ శాఖకు బదిలీ చేసి, ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్‌ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. అలాగే టీకే అనిల్ కుమార్‌ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే ఉపేక్షించం: ప్రధాని మోదీ

విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులు శాంతించాలని, వారి ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొన్నారు.

నేడు కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధుల భేటీ

మరోవైపు ఆందోళనలు నిర్వహిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రతినిధులతో కేంద్ర మంత్రులు శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తటస్థ వేదికపై ఈ చర్చలు జరగనున్నాయి. తమ డిమాండ్ల అమలుపై స్పష్టమైన హామీ వచ్చే వరకు చట్టబద్ధ పోరాటం కొనసాగుతుందని ఉద్యమ నేతలు స్పష్టం చేశారు.

ఇది చాలదు: సీజేపీ

తొలుత ప్రధాని హామీని సీజేపీ తిరస్కరించింది. మంత్రి ప్రధాన్ రాజీనామా చేసేవరకు జంతర్ మంతర్‌ను వీడేది లేదని స్పష్టం చేసింది. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే’ అని పోస్టు పెట్టింది. ప్రధాని ప్రకటనను సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా స్వాగతిస్తూనే… ఆయన స్పందించడానికి నెలన్నర ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. “చర్చించేందుకు తన ఇంటికి రావాలని నడ్డా నుంచి ఆహ్వానం అందింది. కానీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాం. ఏ ఒక్కరి ఇంటికి వెళ్లబోమని మేం చెప్పాం. ప్రజా కోర్టు ఇక్కడే ఉంది. మంత్రులు ప్రజల మధ్యకు రావాలి. వారు చర్చలకురాకపోతే జంతర్ మంతర్ రద్దవుతు రావాలి” అని సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ మధ్యాహ్నం సమయంలో తెలిపారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, తటస్థ వేదిక అయితేనే అంగీకరిస్తామని తెలిపారు. రాత్రికల్లా శుక్రవారం చర్చలకు సీజేపీ ప్రతినిధులు అంగీకరించారు.

విద్యార్థుల అసంతృప్తి అర్థం చేసుకోవాల్సిందే: సచిన్

ప్రశ్నాపత్రాల లీక్‌లపై విద్యార్థుల ఆందోళనకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతుతెలిపారు. వారి అసంతృప్తి అర్థం చేసుకోవల్సినదేనని, సమాజం వారికి హామీ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. “దివంగత నా తండ్రి రమేశ్ టెండూల్కర్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. జీవితం ప్రారంభంలోనే కొన్ని విలువలను ఆయన నుంచి నేర్చుకున్నా. విఫలం కావడాన్ని అంగీకరించవచ్చు.. మోసాన్ని కాదు.. ఎల్లప్పుడూ షార్ట్‌కట్‌లను నమ్ముకోవద్దని ఆయన చెప్పేవారు. పెద్దలుగా మనం మంచి సంస్కృతిని అందించే బాధ్యత తీసుకోవాలి. ప్రయత్నాల కంటే ఫలితాలపై ఆధారపడే, ప్రతిభ కంటే షార్ట్‌కట్‌లను నమ్ముకునే సమాజంలో ఉన్నాం. తమ కష్టాన్ని గుర్తించినప్పుడు విద్యార్థుల్లో తలెత్తే అసంతృప్తిని మనం అర్థం చేసుకోవాలి” అని టెండూల్కర్ వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ నుంచి సమాజంలోని కీలక వర్గాలను బలప్రయోగంలాంటి చర్యలు దూరం చేస్తాయని భాజపా సీనియర్ నేత మురళీమనోహర్ జోషీ వ్యాఖ్యానించారు.

13 మంది కార్యదర్శుల బదిలీ

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం 13 మంది కార్యదర్శులను బదిలీ చేసింది. మరో నలుగురు అధికారులకు కార్యదర్శి స్థాయి హోదా కల్పించింది. పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా ఉన్న 1989 బ్యాచ్ గుజరాత్ కేడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కటికితేల శ్రీనివాస్‌ను ఈశాన్య ప్రాంత అభివృద్ధిశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed