Last Updated:
భారత స్టార్ బ్యాటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లీ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకే సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఈ రకమైన ‘టికెట్ల దోపిడీ’కి తెరతీసిందంటూ క్రీడాభిమానుల నుండి తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.
SRH vs RCB: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్కు చేరుకుంటున్న కొద్దీ మ్యాచ్ల వేడి ఎంతలా పెరుగుతుందో, టికెట్ల ధరల మంట కూడా అంతేలా సామాన్య క్రికెట్ అభిమానులను దహించివేస్తోంది. ముఖ్యంగా ఈ నెల 22న హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్ టికెట్ల ధరలను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అమాంతం పెంచేసింది. భారత స్టార్ బ్యాటర్, రన్మెషీన్ విరాట్ కోహ్లీ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకే సన్రైజర్స్ ఫ్రాంచైజీ ఈ రకమైన ‘టికెట్ల దోపిడీ’కి తెరతీసిందంటూ క్రీడాభిమానుల నుండి తీవ్ర విమర్శలు, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అయితే టాప్-2 స్థానాల్లో నిలిచి క్వాలిఫయర్-1 ఆడేందుకు ఆర్సీబీకి ఈ మ్యాచ్ విజయం ఎంతో కీలకం. మరోవైపు, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి తోడు విరాట్ కోహ్లీ గత మ్యాచ్లోనే అద్భుతమైన అజేయ శతకంతో (సెంచరీ) భీభత్సమైన ఫామ్లో ఉండటంతో కింగ్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈ సమీకరణాలన్నీ కలిసి మ్యాచ్కు విపరీతమైన డిమాండ్ను తెచ్చిపెట్టాయి.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ టికెటింగ్ యాప్లో టికెట్ల విక్రయాలు ప్రారంభించగా.. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఏకంగా 4 లక్షల మంది అభిమానులు డిజిటల్ క్యూ లైన్లో వేచి ఉండటం గమనార్హం. ఉప్పల్ స్టేడియం మొత్తం సామర్థ్యం కేవలం 39,000 సీట్లు మాత్రమే కాగా, అందులో సగానికి పైగా పాస్లు, కాంప్లిమెంటరీలకే పోతాయి. మిగిలిన కొన్ని వేల టికెట్ల కోసం లక్షలాది మంది పోటీ పడటాన్ని యాజమాన్యం తమకు అనుకూలంగా మార్చుకుంది.
గత మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల ధరలను సన్రైజర్స్ ఏకంగా 20 నుండి 30 శాతం వరకు పెంచేసింది. స్టేడియంలోని అన్నింటికంటే తక్కువ ధర కలిగిన నార్త్ స్టాండ్ రెండో టెర్రస్ టికెట్ ధరనే కనిష్ఠంగా రూ. 1,950గా నిర్ణయించారు. ఇక కార్పొరేట్ బాక్సుల ధరలు వింటే సామాన్యులకు గుండె గుభేల్ అనాల్సిందే. సౌత్ రెండో అంతస్తులోని కార్పొరేట్ బాక్స్ గరిష్ఠ టికెట్ ధరను ఏకంగా రూ. 45,000గా ఖరారు చేశారు. అలాగే వెస్ట్ రెండో అంతస్తు కార్పొరేట్ బాక్స్ ధర రూ. 30,000 కాగా, ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్, వెస్ట్ లాంజ్ల ధర రూ. 20,000గా నిర్ణయించారు.
సాధారణ మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు ఎక్కువగా కొనుగోలు చేసే ఈస్ట్, వెస్ట్ స్టాండ్స్ ఫస్ట్ ఫ్లోర్ ధరను రూ. 4,500గా మరియు గ్రౌండ్ ఫ్లోర్ ధరను రూ. 6,000గా పెంచేశారు. మిగిలిన స్టాండ్స్ ధరలను కూడా వరుసగా రూ. 2,050, రూ. 3,250, రూ. 3,500, రూ. 9,000, రూ. 12,000 మరియు రూ. 40,000 వరకు వివిధ కేటగిరీలలో విక్రయించారు. ఇంత భారీగా ధరలు పెంచినప్పటికీ, కోహ్లీ క్రేజ్ మరియు మ్యాచ్ ప్రాధాన్యత దృష్ట్యా కేవలం కొన్ని గంటల్లోనే అన్ని టికెట్లు ‘సోల్డ్ అవుట్’ (అమ్ముడైనట్లు) యాప్లో చూపించడం విశేషం. రేట్లు పెంచినా కొంటున్నారు కదా అని అభిమానుల జేబులకు చిల్లులు పెట్టడం ఫ్రాంచైజీలకు అలవాటుగా మారిందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 16, 2026 11:10 AM IST













