Last Updated:
ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone)తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు (Sandalwood) చెందిన పలువురు స్టార్ నటీనటులకు కర్ణాటక సీఐడీ (CID) అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఆ వివరాలు చూద్దామా..
సినీ రంగాన్ని ఆర్థిక మోసాల కేసులు, అక్రమ నగదు లావాదేవీల వివాదాలు చుట్టుముట్టడం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీలియోన్ (Sunny Leone)తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు (Sandalwood) చెందిన పలువురు స్టార్ నటీనటులకు కర్ణాటక సీఐడీ (CID) అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. ఒక భారీ ఆర్థిక కుంభకోణం కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు, అక్రమ నగదు లావాదేవీలపై వివరణ ఇవ్వాలంటూ వీరందరికీ నోటీసులు జారీ చేసేందుకు సీఐడీ సర్వం సిద్ధం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
బెళగావి కేంద్రంగా పనిచేసే ‘శివం అసోసియేట్స్’ అనే సంస్థ కస్టమర్ల నుంచి ఆకర్షణీయమైన వడ్డీలు, లాభాలు ఆశ జూపి అక్రమంగా పెద్ద మొత్తంలో డిపాజిట్లను వసూలు చేసింది. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఏకంగా 40,700 మంది ఖాతాదారుల నుంచి రూ.2,400 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేశారట. ఆ తర్వాత కస్టమర్లను ముంచేసి బోర్డు తిప్పేయడంతో, ఈ సంస్థ ఓనర్ శివానంద నీలణ్ణవరపై ఆర్థిక మోసాల కేసు నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న సిఐడి అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ప్రజల నుంచి వసూలు చేసిన అక్రమ సొమ్మును సదరు సంస్థ యజమాని సినిమా నిర్మాణాలకు, సెలబ్రిటీ ఈవెంట్లకు విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు రికార్డులను బట్టి గుర్తించారు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’పై అధికారులు ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించారు.
ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న శివానంద నీలణ్ణవర 2023లో ‘ఛాంపియన్’ అనే కన్నడ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలోని ఒక స్పెషల్ ఐటెం సాంగ్లో బాలీవుడ్ భామ సన్నీ లియోన్ చిందేసింది. అయితే ఈ ఒక్క పాట కోసం ఆమెకు రెమ్యూనరేషన్ కింద ఏకంగా రూ.1 కోటి చెల్లించినట్లు సీఐడీ అధికారులు రికార్డు పత్రాల ద్వారా గుర్తించారు. బాధితుల నుంచి వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల సొమ్మునే సన్నీ లియోన్కు పారితోషికంగా ఇచ్చినట్లు అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై పూర్తి వివరణ ఇవ్వాలంటూ తాజాగా కర్ణాటక సీఐడీ సన్నీ లియోన్కు నోటీసులు పంపింది.
కేవలం సన్నీలియోన్ మాత్రమే కాకుండా, శివం అసోసియేట్స్ అక్రమ సొమ్ముతో నిర్వహించిన ‘కన్నడ ఉత్సవం’ ఈవెంట్లో పాల్గొన్న మరికొందరు ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వనున్నారు. ఈ లిస్ట్లో టాలీవుడ్లోనూ సుపరిచితుడైన ప్రముఖ నటుడు డాలి ధనుంజయ్, వశిష్ఠ సింహ, ‘కాంతార’ ఫేమ్ సప్తమీ గౌడ, రాగిణి ద్వివేది ఉన్నారు. ఈ ఈవెంట్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు, అతిథులుగా హాజరైనందుకు వీరందరికీ సదరు సంస్థ భారీగా నగదు ముట్టజెప్పినట్లు సీఐడీ అనుమానిస్తోంది. బాధితుల సొమ్ము ఏయే ఖాతాల్లోకి వెళ్లిందనే కోణంలో విచారణను వేగవంతం చేసిన అధికారులు, త్వరలోనే ఈ స్టార్లందరినీ ముఖాముఖి విచారించనున్నట్లు సమాచారం.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













