Tirumala Hundi Income: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. నెల రోజుల్లోనే ఇన్ని కోట్లా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుమల చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్.. ఆ ఒక్క నెలలో ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు!

News18
News18

ఏడుకొండలవాడి వైభవం అద్వితీయం. ఆ కలియుగ దైవాన్ని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది భక్తజనం తిరుమల కొండకు పోటెత్తుతారు. స్వామివారిపై తమకున్న అపారమైన భక్తిని కానుకల రూపంలో చాటుకుంటారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు సమర్పించే ఈ కానుకలతో శ్రీవారి హుండీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా 2026 జులై నెలలో హుండీ ఆదాయం ఆల్ టైమ్ సెకండ్ హయ్యెస్ట్‌గా నమోదై అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భక్తుల అచంచల విశ్వాసానికి ఈ వసూళ్లు అద్దం పడుతున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. 2026 జులై నెలలో శ్రీవారి హుండీకి ఏకంగా రూ.140.28 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తిరుమల చరిత్రలో ఒకే నెలలో ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటివరకు తిరుమల చరిత్రలో అత్యధిక నెలవారీ ఆదాయం 2022 ఆగస్టులో నమోదైంది. ఆ నెలలో భక్తులు రికార్డు స్థాయిలో రూ.140.34 కోట్లు కానుకలుగా సమర్పించారు. ఇప్పుడు ఆ పాత రికార్డుకు అత్యంత చేరువగా 2026 జులై వసూళ్లు నిలవడం విశేషం. కేవలం కొద్ది లక్షల రూపాయల తేడాతో ఆల్ టైమ్ రికార్డు తృటిలో తప్పిపోయింది.

ఇది కూడా చదవండి: కొబ్బరి, అరటి తోటలు చెరువులయ్యాయి.. పొలాల్లో వలలు వేస్తున్న మత్స్యకారులు.. వీడియో చూస్తే నమ్మలేరు!

సాధారణంగా స్వామివారికి భక్తులు నిలువు దోపిడీ ఇచ్చుకుంటారు. నగదు, బంగారం, వెండి, వజ్రవైఢూర్యాలు, ఖరీదైన ఆభరణాలను హుండీలో వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. కరోనా విపత్తు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత తిరుమల కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అప్పటినుంచి ప్రతి నెలా హుండీ ఆదాయం రూ.100 కోట్లు దాటడం సర్వసాధారణంగా మారిపోయింది. పండుగలు, సెలవు దినాల్లో ఈ వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి: వయసు 20 ఏళ్లు.. రాష్ట్రమంతా గజగజలాడిస్తున్న ఘరానా దొంగల గుట్టురట్టు!

అత్యధిక ఆదాయం వచ్చిన నెలల జాబితాను పరిశీలిస్తే 2022 సంవత్సరానిదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ఆ ఒక్క ఏడాదే అత్యధికంగా ఐదుసార్లు రికార్డు స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. 2022 జులైలో రూ.139.46 కోట్లు, మేలో రూ.130.29 కోట్లు, ఏప్రిల్‌లో రూ.127.50 కోట్లు, జూన్‌లో రూ.123.76 కోట్లు హుండీ ద్వారా వచ్చాయి. అప్పటినుంచి ఆదాయం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా కొనసాగుతూనే ఉంది. 2023 జులైలో రూ.129.08 కోట్లు నమోదు కాగా.. 2024 జులై, ఆగస్టు నెలల్లో రూ.125 కోట్ల చొప్పున ఆదాయం సమకూరింది. ఇక ఈ ఏడాది 2026 జూన్ నెలలో రూ.126 కోట్లు రాగా.. జులైలో ఏకంగా రూ.140 కోట్లు దాటేసి రికార్డు సృష్టించింది.

ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీ, స్వామివారిపై వారికి ఉన్న అపార భక్తిప్రపత్తులకు ఈ కానుకలే ప్రత్యక్ష నిదర్శనం. భక్తులు సమర్పించే ఈ హుండీ ఆదాయాన్ని టీటీడీ అనేక ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తోంది. నిత్యాన్నదానం, విద్యాసంస్థల నిర్వహణ, ఆసుపత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలు తదితర ప్రజాపయోగ కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేస్తోంది. గోవింద నామస్మరణతో నిత్యం మారుమోగే తిరుమలగిరులపై వడ్డికాసులవాడి వైభవం దినదినాభివృద్ధి చెందుతోందనడానికి ఈ హుండీ రికార్డులే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports