Last Updated:
Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలకు విచ్చేసే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది.
కొండపైకి వచ్చే భక్తులు అద్దె గదుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీలుగా గదుల కేటాయింపు విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. గతంలో సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద గదుల కోసం భక్తులు గంటలకొద్దీ వేచి ఉండే అవస్థలకు స్వస్తి పలుకుతూ, నూతనంగా ‘ఉపవిచారణ కార్యాలయాల’ (సబ్ ఎంక్వైరీ ఆఫీస్) ద్వారా గదులను కేటాయించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది.
ఉదయం 5 గంటల నుంచే రిజిస్ట్రేషన్: గదులు కావలసిన భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కార్యాలయం ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచే భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది.
ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్: భక్తుల ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ సహాయంతో అత్యాధునిక ‘ఫేస్ రికగ్నిషన్’ (ముఖ గుర్తింపు) సాంకేతికత ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తారు.
నచ్చిన గది ఎంపిక: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కౌంటర్ వద్ద భక్తులకు రెండు కేటగిరీల గదులను చూపిస్తారు. అందులో భక్తులు తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ ముగియగానే భక్తులకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ రశీదును అందజేస్తారు.
రిజిస్ట్రేషన్ పూర్తయిన భక్తుల నంబర్లు సీఆర్వో ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులపై కనిపిస్తాయి. బోర్డుపై భక్తుల క్రమ సంఖ్య వచ్చిన 15 నిమిషాల లోపు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు గదికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సందేశం (SMS) వస్తుంది.
ఒకవేళ డిస్ప్లే బోర్డుపై నంబర్ వచ్చినప్పటికీ మొబైల్ ఫోన్కు ఎస్మెస్ రాకపోతే భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అక్కడే ఏర్పాటు చేసిన ‘కియోస్క్ యంత్రాల’ వద్ద భక్తులు తమ వద్ద ఉన్న ఎక్నాలెడ్జ్మెంట్ రశీదును స్కాన్ చేస్తే చాలు, వారికి కేటాయించిన గది వివరాలు స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి.
మెసేజ్ లేదా కియోస్క్ ద్వారా గది వివరాలు తెలుసుకున్న భక్తులు నేరుగా ఆయా ప్రాంతాల్లోని ఉపవిచారణ కార్యాలయాలకు (Sub-Enquiry Offices) చేరుకోవాలి. అక్కడ ఆన్లైన్ ద్వారా నిర్ణీత అద్దెను చెల్లించి గది తాళంచెవిని స్వాధీనం చేసుకోవచ్చు.
తితిదే ప్రవేశపెట్టిన ఈ సరికొత్త విధానం వల్ల దళారుల బెడద తప్పడమే కాకుండా, సామాన్య భక్తులకు చాలా సమయం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.
Hyderabad,Telangana














