ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయ పరిసరాలు, లడ్డు కౌంటర్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో టీటీడీ ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేసింది. భక్తులు కాళ్లు కాలకుండా, నేల వేడి నుండి రక్షణ కల్పించేందుకు నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయించారు. వీటితో పాటు, బాటగంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న క్యూ లైన్లలో భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక మరుగుదొడ్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.
భక్తులకు ఎప్పటికప్పుడు దర్శన సమాచారాన్ని, క్యూ లైన్ల అప్డేట్స్ను అందించడానికి రేడియో మరియు బ్రాడ్కాస్టింగ్ విభాగం ద్వారా 5 భాషల్లో నిరంతరం అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు అయోమయానికి గురికాకుండా తమ దర్శన సమయాన్ని ప్లాన్ చేసుకోగలుగుతున్నారు.
క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తుల ఆకలితీర్చడమే ధ్యేయంగా వందలాది మంది శ్రీవారి సేవకులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వెలుపల ఉన్న సుదీర్ఘమైన క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు రౌండ్ ది క్లాక్ (24 గంటలు) షిఫ్టుల పద్ధతిలో నిరంతరాయంగా తాగునీరు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
అదేవిధంగా, టీటీడీ ఆరోగ్య విభాగం పర్యవేక్షణలో రద్దీగా ఉండే ప్రాంతాలలో మొబైల్ వాటర్ డ్రమ్స్ను అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా క్యూ లైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు తాగునీటిని అందిస్తున్నారు. భక్తుల రద్దీని బట్టి, అత్యవసర వైద్య సేవల కోసం ఔటర్ రింగ్ రోడ్డులోని క్యూ లైన్ల వెంబడి మొబైల్ ఫస్ట్-ఎయిడ్ (ప్రథమ చికిత్స) కేంద్రాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
తిరుమలలో వసతి సౌకర్యాలు పరిమితంగా ఉండటం వల్ల టీటీడీ ఒకేసారి కేవలం 60,000 మంది భక్తులకు మాత్రమే వసతి కల్పించగలదు. ప్రస్తుతం భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో ఉండటంతో పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5 మరియు పీఏసీ (పద్మనాభ నిలయం)లలో ఉన్న 9,000 లాకర్లు పూర్తిగా నిండిపోయాయి. అందువల్ల భక్తులు వసతి విషయాల్లో సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల కోసం కూడా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన కల్యాణకట్టతో పాటు 11 మినీ కల్యాణకట్టలు భక్తుల కోసం 24 గంటల పాటు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి.
గత ఐదు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 4,32,213 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మే 16, 17 తేదీల్లో ఒక్కో రోజు 90,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. దర్శనాలతో పాటు తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. మే 18, 19, 20 తేదీల్లో 43,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇక అన్నప్రసాద వితరణ విషయానికి వస్తే.. గత ఐదు రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 19 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు మరియు మజ్జిగను పంపిణీ చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఎంత ఉన్నా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి.












