Last Updated:
వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఫామ్ లేమిని సాకుగా చూపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు ప్రదర్శనపై సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ధృవీకరించని పుకార్లపై ఆ జట్టు మేనేజ్మెంట్, సహ యజమాని ప్రీతి జింటా తీవ్రంగా స్పందించారు. జట్టు ప్రతిష్టను, ఆటగాళ్ల గౌరవాన్ని దెబ్బతీసేలా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ మేరకు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ మరియు ప్రీతి జింటా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు.
ఈ సీజన్ ప్రారంభంలో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఫామ్ను కనబరిచింది. ఆడిన మొదటి ఏడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచింది. ఒక దశలో ప్లేఆఫ్స్ చేరడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుందని అందరూ భావించారు. అయితే, మధ్య సీజన్లో జట్టు ఫామ్ ఒక్కసారిగా తలకిందులైంది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలవ్వడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఫామ్ లేమిని సాకుగా చూపిస్తూ సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
తమ జట్టుపై వస్తున్న తప్పుడు వార్తలపై పంజాబ్ కింగ్స్ ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. కేవలం వ్యూస్ మరియు ఎంగేజ్మెంట్ కోసం “ఫేక్ స్టోరీస్” సృష్టించవద్దని కోరింది. ముఖ్యంగా క్రీడా జర్నలిస్టులు వాస్తవాలను సరిచూసుకోకుండా వార్తలను ప్రచురించవద్దని తొలుత ఘాటుగా పోస్ట్ చేసింది. “విమర్శలు, సరదా సంభాషణలు, అభిప్రాయాలు క్రీడలో భాగమే. కానీ చౌకబారు ప్రచారం కోసం కల్పిత గాథలను సృష్టించడం సరికాదు” అని పేర్కొంది. అయితే, కొద్దిసేపటికే ఆ పోస్ట్ను తొలగించి, “క్రీడా జర్నలిస్టులు” అనే పదాన్ని తీసివేసి సవరించిన కొత్త పోస్ట్ను పెట్టింది.
జట్టు సహ యజమాని ప్రీతి జింటా కూడా ఈ విషయంపై గట్టిగానే స్పందించారు. “విమర్శకు మరియు ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారానికి చాలా తేడా ఉంది. ఆటపై ఆరోగ్యకరమైన చర్చను మేము ఎప్పుడూ ఆహ్వానిస్తాం. కానీ వ్యక్తులను, జట్టును లేదా బ్రాండ్ను దెబ్బతీసేలా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు” అని ఆమె స్పష్టం చేశారు. మీడియా నిపుణులు మరియు ధృవీకరించబడిన ఖాతాలు కలిగిన వారు సమాచారాన్ని షేర్ చేసే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు.
ఇటీవల పంజాబ్ ఆటగాడు చాహల్ విమానంలో ఈ-సిగరెట్ పీల్చినట్లుగా ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో చాహల్కు బౌలింగ్ ఇవ్వకపోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు ఈ జట్టు ఓపెనర్ ప్రభ్సిమ్రున్ సింగ్ ఫిట్నెస్ కోల్పోవడమూ చర్చకు దారితీసింది.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తమ తదుపరి మ్యాచ్లో గురువారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. ఈ కీలక సమయంలో జట్టుపై వస్తున్న ఇలాంటి పుకార్లు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఫ్రాంచైజీ భావిస్తోంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 13, 2026 11:44 AM IST













