తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. తారామతి బారాదరి, దుర్గం చెరువు, పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా మార్చాలని అధికారులను ఆదేశించారు.వికారాబాద్ ప్రాంతాన్ని సరికొత్త టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ఆయన చెప్పారు. అలాగే ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి అర్బన్ ఫారెస్ట్లను అభివృద్ధి చేయాలని సూచించారు. డిసెంబర్లో జరగబోయే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ కోసం వివిధ శాఖల సమన్వయంతో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
పోక్సో కేసులో బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆయనకు బెయిల్ ఇచ్చి బయటకు పంపితే.. సాక్షులు స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడే అవకాశం ఉందని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించారు. అటు నిందితుడు జైల్లో ఉన్నప్పుడే దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టుకు తెలిపారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది.
రాబోయే రోజుల్లో కుప్పం నియోజకవర్గం దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన ఆయన.. స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మూడు రోజుల పర్యటన ఎంతో ఉత్సాహంగా సాగిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రశాంతమైన కుప్పం వాతావరణం తనకు కొత్త శక్తిని ఇచ్చిందని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కంగుంది భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. నియోజకవర్గంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా 30 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ‘బంగారు కుప్పం’ సాకారం కోసం సమగ్ర విజన్ను సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
సుగాలి ప్రీతి కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పార్వతి డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు న్యాయం చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆధారాలు లేవంటున్నారని ఆమె ఆరోపించారు. గెలవక ముందు ఒకలా, గెలిచిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారంటూ పవన్ కళ్యాణ్పై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని కోరారు. తన కూతురి కేసుపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని పార్వతి డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుందని ఆనందించే లోపే, వాతావరణ శాఖ (IMD) ప్రజలను అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.ముఖ్యంగా రాజధాని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి ప్రజలు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వాడ్లో ఘోర మేఘ విస్ఫోటం సంభవించింది. దీనివల్ల వచ్చిన ఆకస్మిక వరదలతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.కిశ్త్వాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ వద్ద తీవ్ర నష్టం జరిగింది. అక్కడ ఉన్న పలు వాహనాలు బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. ఆ వాహనాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
శ్రీలంకలోని నెగోంబో జైలులో ఘోరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 25కి చేరింది. మృతుల్లో ఖైదీలతో పాటు నలుగురు జైలు గార్డులు కూడా ఉన్నారు.
మరో 100 మందికి పైగా ఖైదీలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఐదేళ్లలో శ్రీలంక జైళ్లలో జరిగిన అత్యంత దారుణమైన ఘర్షణ ఇదేనని అధికారులు తెలిపారు. జైలులో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) వ్యవహారంలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. జైలు సామర్థ్యానికి మించి వేలాది మంది ఖైదీలు ఉండడం వల్లే ఈ అల్లర్లు ఇంత పెద్ద ప్రమాదానికి దారితీశాయి.
రష్యాలోని చమురు క్షేత్రాలు, ఇంధన సంస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసింది. సోమవారం తెల్లవారుజామున ఈ భారీ దాడులు జరిగాయి. భారత్కు చమురు ఎగుమతి చేసే బాల్టిక్ సముద్రంలోని వైసోట్స్క్, ఉస్ట్-లుగా పోర్టులు ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాము 70కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా అధికారులు తెలిపారు. చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు జరగడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో చమురు నింపే కేంద్రాల వద్ద ట్యాంకర్లు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ‘మహాభారతం’ కాన్సెప్ట్తో సాగే ఒక కీలక సీన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారట.ఇటీవలే ఎన్టీఆర్ను అఖిల్ కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ భారీ చిత్రం ఈనెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు, ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్న తారక్ లేటెస్ట్ లుక్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. నిన్న జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్లో ఆయన ఫ్యాన్ క్లబ్ అధికారిక జెండాను విడుదల చేసింది.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. దీంతో దళపతి విజయ్ రాజకీయ ప్రయాణాన్నే ధనుష్ కూడా ఫాలో అవుతున్నారనే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకునే ధనుష్ ఈ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ రాజకీయ ఎంట్రీ ప్రచారంపై హీరో ధనుష్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.












