Top News: టూడే టాప్ 10 న్యూస్.. ఒక్క క్లిక్‌తో తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్.. | | ACTPnews

Today Top 10 News: ఎబోలా వైరస్ పై కేంద్రం హెచ్చరికలు.. సోషల్ మీడియాను షేక్ చేసిన ఎన్టీఆర్ | తెలంగాణ వార్తలు


1.తెలంగాణ విఫలం కాలేదు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఆర్థిక ప్రగతిపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో తెలంగాణ ఎగువ మధ్య ఆదాయ స్థాయిని దాటిన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని, దేశంలోని టాప్-5 రాష్ట్రాల్లో చోటు దక్కడం గర్వకారణమన్నారు. ఈ విజయానికి కేసీఆర్ దార్శనిక పాలన, తెలంగాణ ప్రజల కృషే కారణమని పేర్కొన్నారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ చేస్తున్న ప్రచారాలకు ప్రపంచ బ్యాంకు నివేదికే సమాధానమని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పదేళ్లలో విశేషంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

2.మంత్రి పదవి ఇస్తే.. నీళ్లు తెచ్చి చూపిస్తా

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మూడు నెలల పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు ఇస్తే కన్నెపల్లి పంపుహౌస్ మోటార్లను ప్రారంభించి ఎల్లంపల్లికి నీటిని తరలిస్తానని, బ్యారేజీ ఎత్తుపై మహారాష్ట్ర అనుమతులకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తన ఆరోపణలు తప్పని తేలితే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

3.నేను వివరణ ఇవ్వను -కడియం శ్రీహరి

దేవాదాయ శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. తనకు ఆ శాఖపై సమీక్ష నిర్వహించే హక్కు లేదని తెలుసునని, కేవలం నియోజకవర్గంలోని ఆలయాల సమస్యల పరిష్కారం కోసమే అధికారులు, ఆలయ చైర్మన్లను కలిసినట్లు తెలిపారు. కొండా సురేఖను పరోక్షంగా విమర్శిస్తూ, కొందరు రాజకీయ నాయకులు వివాదాలు సృష్టించి వార్తల్లో ఉండాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అవసరమైతే మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి తన నియోజకవర్గానికి నిధులు తీసుకొస్తానని పేర్కొన్నారు.

4.పవన్‌ను ఎదిరించడానికి టీడీపీ పెంచిన మొక్కే రావణ్!

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పవన్ కళ్యాణ్‌ను ఎదుర్కొనేందుకు టీడీపీనే రావణ్‌ను ప్రోత్సహించిందని ఆరోపించారు. రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి అయితే తమపై విమర్శలు చేస్తూ ఎందుకు పోస్టులు పెట్టాడని ప్రశ్నించారు. వైసీపీ ప్రశ్నిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనల గురించేనని స్పష్టం చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు.

5.నటుడు అఖిల్‌లో ఆ బాధ ఉంది

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, ప్రతి తండ్రి తన బిడ్డ విజయాన్ని కోరుకుంటాడని, ‘మనం’ తర్వాత తొలిసారి అక్కినేని అఖిల్ సినిమా కోసం ఇంతగా పని చేస్తున్నానని చెప్పారు. అఖిల్‌లో ఓ రకమైన బాధ ఉందని, దానికి ఈ సినిమా సరిగ్గా సరిపోతుందని, సినిమా అద్భుతంగా ఉంటుందని అన్నారు. అఖిల్, ఈ కథ తనలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని, ‘లెనిన్’ పాత్ర కోసం మానసికంగా చాలా సిద్ధమయ్యానని తెలిపారు.

6.ఆ కథ విన్నాక నిద్రపట్టలేదు

ఆహార కల్తీ అనే కీలక సమస్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కథ విన్న తర్వాత కల్తీ ఆహారం వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆలోచిస్తూ కొన్ని రాత్రులు నిద్రపట్టలేదని ఆమె తెలిపారు. దర్శకుడు చేతన్ డీకే రూపొందిస్తున్న ఈ కోర్ట్‌రూమ్ డ్రామా వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే కథతో పాటు వినోదాత్మకంగా కూడా ఉంటుందని కాజల్ పేర్కొన్నారు.

7.టీమ్‌ఇండియాపై దినేశ్‌ కార్తిక్ ఫైర్

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్ ధాటికి తొలి ఐదు ఓవర్లలోనే భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఈ పరాజయానికి జట్టు యాజమాన్యం తీసుకున్న బ్యాటింగ్ క్రమ నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ విమర్శించారు. ముఖ్యంగా శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యకరమని, అలాంటి నిర్ణయాలు జట్టుపై ప్రతికూల ప్రభావం చూపాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా హర్షిత్ రాణా 13 బంతుల్లో 9 పరుగులు చేయగా, ఆ తర్వాత వచ్చిన శివమ్ దూబే 2 పరుగులకే ఔటయ్యాడు.

8. మోదీ నోట ‘కుచ్ కుచ్‌ హోతా హై’ పాట

ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఇండోనేసియాలో భారతీయ సినిమాలకు ఉన్న ఆదరణను గుర్తుచేస్తూ, కుచ్ కుచ్ హోతా హై టైటిల్ పాటను ప్రస్తావించారు. భారత్, ఇండోనేసియా కలిసి ముందుకు సాగితే ‘కుచ్ కుచ్’ నుంచి ‘బహుత్ కుచ్’ సాధించవచ్చని చమత్కరించారు. దీనిపై స్పందించిన కరణ్ జోహర్, తన చిత్రాన్ని ప్రధాని ప్రస్తావించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

9.చైనాలో భీకర వరద

చైనాలో ఎడతెరిపి లేని వర్షాలతో భారీ వరదలు సంభవించి 62 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో 20 మంది మృతిచెందగా, 331 మంది గాయపడ్డారు. వరదల కారణంగా హెంగ్‌జౌలోని ఓ పాముల ఫాం కూలిపోవడంతో దాదాపు 900 పాములు బయటకు తప్పించుకున్నాయి. తప్పించుకున్న పాముల్లో ఎక్కువ భాగం విషపూరితం కానివేనని అధికారులు తెలిపినా, వాటిని స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

10. అమెరికా బేస్‌లపై ఇరాన్‌ క్షిపణీ దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్ జలసంధి పరిణామాల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌ వైమానిక రక్షణ, తీర నిఘా వ్యవస్థలపై దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ, అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్‌, కువైట్‌లోని అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్‌తో పాటు మొత్తం 85 అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించినట్లు తెలిపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports