TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ దర్శనం, గదుల బుకింగ్ షెడ్యూల్ రిలీజ్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, అంగప్రదక్షిణం, వర్చువల్ సేవలు, అలాగే తిరుమల,తిరుపతిలో వసతి గదులను బుక్ చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది.

News18
News18

అక్టోబర్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి ట్రస్టు దర్శనం, అంగప్రదక్షిణం, వర్చువల్ సేవలు, అలాగే తిరుమల,తిరుపతిలో వసతి గదులను బుక్ చేసుకోవాలనుకునే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. జూలై 18 నుంచి 24వ తేదీ వరకు దశలవారీగా వివిధ సేవలు, దర్శనాలు, గదుల కోటాలను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు నిర్ణీత తేదీలు, సమయాల్లో మాత్రమే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోటాను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. భక్తులు జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ డిప్‌లో ఎంపికైన భక్తులు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు టికెట్ మొత్తాన్ని చెల్లిస్తే మాత్రమే వారికి సేవా టికెట్లు ఖరారు అవుతాయి.

అలాగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించిన టికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న దర్శన స్లాట్లను కూడా టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు నిర్ణీత సమయంలోనే బుకింగ్ చేసుకోవాలని సూచించింది.

జూలై 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా అందుబాటులోకి రానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. ఈ కేటగిరీకి చెందిన భక్తులు నిర్ణీత నిబంధనల ప్రకారం టోకెన్లు బుక్ చేసుకోవచ్చు.

ఇక అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల కోటాను కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్‌లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in⁠ ద్వారానే చేసుకోవాలని, ఇతర అనధికార వెబ్‌సైట్లు లేదా మధ్యవర్తులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports