TTD job scam: టీటీడీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో కోట్ల కుచ్చుటోపీ..! ttd jobs fraud one arrested. | | ACTPnews

News18


Last Updated:

టీటీడీలో ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో నిరుద్యోగులను మోసం చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

+

News18

టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన భారీ మోసం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. టీటీడీ పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించి పలువురిని మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అడ్వకేట్‌గా తనను తాను పరిచయం చేసుకున్న అతను, టీటీడీ ఉన్నతాధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం ద్వారా ఉద్యోగాలు ఇప్పించగలనని నమ్మించి నిరుద్యోగులను తన వలలోకి దింపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతనే లక్ష్యంగా చేసుకున్న నిందితుడు, టీటీడీలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారని, ముఖ్యంగా అన్యమత ఉద్యోగుల స్థానాల్లో కొత్త నియామకాలు చేపడుతున్నారని చెప్పి నమ్మబలికినట్లు తెలుస్తోంది. ఉద్యోగం ఖాయం చేస్తానంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భారీ మొత్తాలను వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు టీటీడీ అధికారిక లోగోతో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను తయారు చేసి అందజేయడంతో, నిజంగానే ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో పలువురు లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.

డబ్బులు చేతికి వచ్చిన తర్వాత జాయినింగ్ తేదీలు త్వరలోనే వస్తాయని, ఫైళ్లు ప్రాసెస్‌లో ఉన్నాయని, మరికొన్ని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాక విధుల్లో చేరుస్తామని చెబుతూ నెలల తరబడి కాలయాపన చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే అనుమానం వచ్చిన కొందరు టీటీడీ అధికారులను నేరుగా సంప్రదించగా, తమ వద్ద ఉన్న అపాయింట్‌మెంట్ లెటర్లు పూర్తిగా నకిలీవని, అలాంటి నియామక ప్రక్రియ అసలే లేదని తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఉద్యోగాల మోసంలో 10 నుంచి 25 మందికి పైగా నిరుద్యోగులు బాధితులుగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి నుంచి కోట్ల రూపాయల మేర డబ్బులు వసూలు చేసినట్లు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్ల తయారీ, డబ్బుల లావాదేవీలు, ఈ మోసంలో మరెవరైనా భాగస్వాములు ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. పూర్తి విచారణ అనంతరం ఈ భారీ ఉద్యోగాల స్కామ్‌కు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports