Last Updated:
US Iran War: అమెరికా, ఇరాన్ యుద్ధం 9వ రోజుకు చేరింది. హార్మూజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో.. చమురు ధరలు బ్యారెల్కి $90 దాటాయి. అప్డేట్స్ తెలుసుకోండి.
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు నేడు (జులై 20) కూడా కొనసాగుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, అమెరికా సైన్యం ఇరాన్పై తొమ్మిదో రోజు రాత్రి వరుస దాడులు చేపట్టింది. ఇరాన్ సైనిక కమాండ్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్ సైట్లు, మిసైల్, డ్రోన్ లాంచ్ సైట్లు, కమ్యూనికేషన్స్ నెట్వర్క్లపై దాడులు చేసింది. ఇలా దాడులు చెయ్యడం ద్వారా.. వాణిజ్య నౌకలకు ఇరాన్ బెదిరింపులు తగ్గుతాయని అమెరికా భావిస్తోంది.
ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC).. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న 2 నౌకలను టార్గెట్ చేసి పేల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆ నౌకలు కదలలేని స్థితిలో ఉన్నాయనీ,.. అమెరికా తమపై దాడులు కొనసాగిస్తే, హార్మూజ్ గుండా ఒక్క చుక్క చమురు కూడా సురక్షితంగా దాటదు అని ఇరాన్ హెచ్చరించింది. అమెరికాపై ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉండాలని తన సైన్యానికి ఇరాన్.. ఆదేశమిచ్చిందని రాయిటర్స్, అల్ జజీరా రిపోర్ట్ చేశాయి.
తమ సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకున్నామని, శక్తిమంతమైన దాడులు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ తాజా దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు చనిపోయినట్లు తెలిసింది. జోర్డాన్లో ఇరాన్ జరిపిన దాడిలో ఇద్దరు, ఇరాక్లో మరొకరు అమెరికన్ సైనికులు మరణించారు. ఇటీవలి ఘర్షణల్లో ఇప్పటివరకూ అమెరికాకి చెందిన 17 మంది సైనికులు చనిపోయినట్లు సమాచారం. ఈ కారణంగానే అమెరికా కూడా దాడుల తీవ్రతను పెంచింది.
కువైట్లో ఇరాన్ దాడులు, మంటలు:
అమెరికా, ఇరాన్ ఘర్షణల ప్రభావంతో గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలో ఉన్నాయి. కువైట్లోని అల్ సుబియా పవర్ జనరేషన్, వాటర్ డీశాలినేషన్ ప్లాంట్పై ఇరాన్ భారీ దాడి చెయ్యగా.. మంటలు చెలరేగాయి. ఇది రెండవసారి దాడి అని కువైట్ అధికారులు తెలిపారు. బహ్రెయిన్, జోర్డాన్లలో కూడా సైరన్లు మోగాయి. ఈ దాడుల ద్వారా ఇరాన్.. తమ పౌరులు, కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను లక్ష్యం చేసుకుందని కువైట్ ఆరోపించిందని అల్ జజీరా రిపోర్ట్ చేసింది.
భగ్గుమంటున్న చమురు ధరలు:
ఈ ఉద్రిక్తతలతో పశ్చిమాసియా ప్రాంతం దద్దరిల్లుతోంది. చమురు ఒక బ్యారెల్ ధర $90 దాటింది. చమురు సరఫరాకి అంతరాయం కలుగుతుందేమో అనే భయం కారణంగా ధరలు పెరిగాయి. హార్మూజ్ జలసంధిని కంట్రోల్ చేసేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు, అందుకు అమెరికా ప్రభుత్వ రియాక్షన్లూ కలిసి.. ఉద్రిక్తతలు, భయాలను పెంచుతున్నాయి.
ఖతార్ 10-రోజుల ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం అమెరికా దాడులు ఆపేసి, ఇరాన్.. తమ నౌకలను పంపుకునేందుకు వీలు కల్పించాలి. ప్రస్తుతం అమెరికా.. ఇరాన్ నౌకలను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటోంది. తాజాగా ట్రంప్.. గల్ఫ్ దేశాలు.. ఉద్రిక్త పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మిస్సైల్ దాడులకు గట్టిగా
స్పందిస్తామని హెచ్చరించింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగానే తాజా దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా తీరు చూస్తుంటే.. ఉద్రిక్తతలు మరింత పెరిగేలా ఉన్నాయి. ఇరాన్ కూడా.. తేల్చుకునేందుకే రెడీ అయ్యింది. రెండువైపులా మాటల, దాడుల యుద్ధం కొనసాగుతోంది. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరగట్లేదు. ఇరాన్.. హార్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల.. ప్రపంచ దేశాలకు చమురు ఎగుమతి తగ్గిపోతోంది. దీని వల్ల చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














