Last Updated:
తాను అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం లోపలే ఉన్నానని ఆయన వెల్లడించారు. లెబనాన్కు చెందిన ‘అల్ మయాదీన్’ టెలివిజన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు.
US-Iran War: పశ్చిమ ఆసియా (Middle East) లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల (ఫిబ్రవరి 28) భీకర క్షణాలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) గుర్తుచేసుకున్నారు. టెహ్రాన్పై జరిగిన ఆ మొదటి విడత దాడుల సమయంలో, తాను అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం లోపలే ఉన్నానని ఆయన వెల్లడించారు. లెబనాన్కు చెందిన ‘అల్ మయాదీన్’ టెలివిజన్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరాగ్చీ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు.
“ఖమేనీ అమరత్వానికి (మరణానికి) దారితీసిన ఆ దాడి సమయంలో నేను అదే భవనంలో ఉన్నాను. దాడి తర్వాత శిథిలాల (Rubble) గుండా బయటకు వచ్చినప్పుడు నా మొదటి ఆలోచన, ఆందోళన అంతా సుప్రీం లీడర్ క్షేమసమాచారాల గురించే” అని అరాగ్చీ పేర్కొన్నారు. మార్చి 1న ఖమేనీ మరణాన్ని ఇరాన్ అధికారికంగా ధృవీకరించడానికి ముందు, ఆ శిథిలాల మధ్య సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. ఖమేనీ పరిస్థితిపై రెండు రోజుల పాటు తీవ్ర సందిగ్ధతలో గడిపినట్లు ఆయన వివరించారు.
దాడికి ముందు సురక్షిత ప్రాంతానికి లేదా బంకర్లలోకి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ అలీ ఖమేనీ నిరాకరించారని విదేశాంగ మంత్రి తెలిపారు. “నా దేశ ప్రజల్లో ప్రతి ఒక్కరికీ సురక్షితమైన స్థలం లభించే వరకు నేను ఎలాంటి షెల్టర్ లేదా సురక్షిత ప్రాంతానికి వెళ్లను. నా ప్రజలకు ఏది జరిగితే నాకూ అదే జరుగుతుంది” అని ఖమేనీ తనతో అన్నట్లు అరాగ్చీ గుర్తుచేసుకున్నారు.
ఇరాన్కు పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు తాము ముందే హెచ్చరికలు జారీ చేశామని అరాగ్చీ స్పష్టం చేశారు. తమపై దాడుల కోసం పొరుగు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను (US Military Bases) ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే.. ఆయా దేశాలపై ఇరాన్ ఎదురుదాడి చేయడం ఖాయమని ముందే చెప్పామన్నారు. గల్ఫ్ ప్రభుత్వాలు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించినప్పటికీ, వాషింగ్టన్ ఏకపక్షంగా ముందుకు సాగిందని విమర్శించారు. అయినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఊహించని విధంగా ఇరాన్ అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు దాడితో వారిని షాక్కు గురిచేసిందని ఆయన అన్నారు.
ఇరాన్ దేశ నాయకత్వ మార్పుపై స్పందిస్తూ.. అలీ ఖమేనీ కుమారుడు మరియు వారసుడైన సయ్యద్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ప్రస్తుతం ఇరాన్ పూర్తి అధికారాల పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నారని అరాగ్చీ స్పష్టం చేశారు. కొత్త సుప్రీం లీడర్తో నిరంతరం సంప్రదింపులు సాగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాలు ఎలాంటి అంతరాయం లేకుండా అమలు చేయబడుతున్నాయని చెప్పారు. గత నాయకత్వానికి చూపిన విధేయత మరియు గౌరవమే ప్రస్తుత విప్లవాత్మక కొత్త నాయకుడికి కూడా పూర్తిగా లభిస్తుందని ఆయన తెలిపారు.
గత ఏప్రిల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ (Ceasefire) ప్రకటించినప్పటి నుండి అమెరికా-ఇరాన్ మధ్య పోరాటం తాత్కాలికంగా ఆగినప్పటికీ, ఇరు పక్షాల మధ్య నెలకొన్న తీవ్రమైన అవిశ్వాసం మరియు నిలిచిపోయిన చర్చల కారణంగా ఈ శాంతి ఒప్పందం ఇంకా సున్నితంగానే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













