అర్హతలు, రిజిస్ట్రేషన్:
18 నుంచి 30 సంవత్సరాల వయస్సు గల యువత ఈ కార్యక్రమానికి అర్హులు. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, NSS/NYKS వాలంటీర్లు, యువ ప్రొఫెషనల్స్ సహా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఆగస్టు 18, 2026. అధికారిక పోర్టల్ https://ebsb.aicte-india.org ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సులభం. పోర్టల్లోకి వెళ్లి అవసరమైన వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, ఆసక్తి ఉన్న రాష్ట్రం వంటి సమాచారం నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఎంపికైన వారు.. ప్రయాణ రోజులు కాకుండా మరో 5 నుంచి 7 రోజుల.. విద్యా, సాంస్కృతిక పర్యటనలు చేస్తారు. వారి జత చేసిన రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలకు వెళ్లి స్థానిక సంప్రదాయాలు, విద్యా సంస్థలు, పాలనా చొరవలు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లు, పరిశ్రమలు, వారసత్వ స్థలాలు, సమాజ జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు.
ఈ ఫేజ్లో 20 ఉన్నత విద్యా సంస్థలు.. అంటే IITలు, IIMలు, కేంద్ర యూనివర్శిటీలు, NITలు.. నోడల్ సంస్థలుగా ఉన్నాయి. రాష్ట్రాల జతలను గమనిస్తే.. ఉత్తర ప్రదేశ్-కేరళ, మధ్యప్రదేశ్-కర్ణాటక, అసోం-తెలంగాణ, గోవా-మిజోరం, రాజస్థాన్-సిక్కిం, జమ్మూకాశ్మీర్-లడఖ్-మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్-ఉత్తరాఖండ్, చండీగఢ్-గుజరాత్, హిమాచల్ ప్రదేశ్-ఒడిశా, ఢిల్లీ-తమిళనాడు జతలుగా ఉన్నాయి.
తెలంగాణ యువతకు ఈ ఫేజ్లో ప్రత్యేక అవకాశం ఉంది. అసోం-తెలంగాణ జతలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నోడల్ సంస్థగా ఉంది. కాబట్టి తెలంగాణ యువత సులభంగా పాల్గొనవచ్చు. ఆంధ్రప్రదేశ్.. ఈ ఫేజ్ జతల జాబితాలో ప్రత్యేకంగా లేకపోయినా, దేశవ్యాప్తంగా 18-30 సంవత్సరాల యువత అందరికీ రిజిస్ట్రేషన్ తెరిచి ఉంది కాబట్టి AP యువత కూడా దరఖాస్తు చేసుకుని పాల్గొనే అవకాశం ఉంది. గత ఫేజ్లలో AP వారు కూడా పాల్గొన్నారు.
కార్యక్రమం ఐదు థీమాటిక్ స్తంభాల (5Ps) చుట్టూ నిర్మించి ఉంది. పర్యటన్ (పర్యాటకం), పరంపర (సంప్రదాయాలు & సంస్కృతి), ప్రగతి (అభివృద్ధి & పాలన), పరస్పర సంపర్క్ (ప్రజల మధ్య కనెక్ట్), ప్రోద్యోగికి (టెక్నాలజీ & ఇన్నోవేషన్). ఇవి NEP 2020 లాంటివే. “హోల్ ఆఫ్ గవర్నమెంట్” విధానంతో వివిధ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, HEIs సహకారంతో ఇది అమలవుతోంది. గత ఫేజ్లలో యువత నుంచి భారీ స్పందన వచ్చింది.
యువసంఘం (Yuva Sangam) కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులు/యువతకు ప్రధాన ఖర్చులను ప్రభుత్వం/హోస్ట్ సంస్థలు భరిస్తాయి. ప్రయాణం (ట్రైన్/బస్), బోర్డింగ్ (వసతి), లాడ్జింగ్, ఆహారం వంటి అన్ని ప్రధాన ఖర్చులూ ఉచితం. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు.
ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ కార్యక్రమం.. యువతను భారత వైవిధ్యాన్ని అనుభవించి, ఏకత్వాన్ని ప్రోత్సహించే రాయబారులుగా తీర్చిదిద్దుతోంది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసి, జాతీయ సమైక్యతకు దోహదం చేయాలని విద్యా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. రిజిస్ట్రేషన్కు ఆలస్యం చేయకండి. చివరి తేదీ ఆగస్టు 18 అని మర్చిపోవద్దు. యువత ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని ఈ ప్రయాణంలో పాల్గొనండి.













